సామాన్యుల నెత్తిన మరో పిడుగు.. వాటి ధరలకు రెక్కలు?

24 May, 2022 15:40 IST|Sakshi

నిత్యవసర వస్తువల ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కూరగాయలు, వంట నూనెకు తోడు ఇటీవల గోధుమల ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు చక్కెర రెడీ అవుతుంది. అయితే పంచదార ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించవచ్చని తెలుస్తోంది.

బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించనుందంటూ రాయిటర్స్‌, బ్లూంబర్గ్‌లు కథనాలు ప్రచురించాయి.  ఈ ఏడాది చక్కెర ఎగుమతులను కేవలం 10 మిలియన్‌ టన్నులకే పరిమితి చేసే అవకాశం ఉందంటూ తేల్చి చెప్పాయి. బయటి దేశాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తే దేశీయంగా కొరత వచ్చి ధరలు పెరగవచ్చనే అంచనాతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చంటూ వార్తలు గుప్పుమన్నాయి.

మన దేశంలో వార్షిక చక్కెర ఉత్పత్తి సామర్థ్యం  35.5 మిలియన్‌ టన్నులు. ఇందులో 9.5 మిలియన్‌ టన్నుల చక్కెరని ఈ ఏడాది ఎగుమతి చేయోచ్చని ముందుగా అంచనా వేసి ఆ మేరకు అనుమతులు జారీ చేశారు.  అయితే  సగం ఏడాది కూడా పూర్తి కాకముందే ఇప్పటికే 8 మిలియన​ టన్నుల చక్కెర ఎగుమతులకు ఆర్డర్లు వచ్చాయి. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల్లో చక్కెరకు డిమాండ్‌ పెరిగింది. దీంతో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగితే మన దేశంలో ఉన్న చర్కెర అంతా విదేశాలకు తరలి వెళ్లే ప్రమాదం ఉంది.  అందుకే  ముందు జాగ్రత్త చర్యగా చక్కెర ఎగుమతులపై కేంద్రం పరిమితి విధించవచ్చని తెలుస్తోంది. 

ప్రస్తుత మార్కెట్‌లో చక్కెర కిలో ధర సగటున 41.50 దగ్గర ఉంది. ప్రభుత్వం కనుక ఎగుమతులపై పరిమితి విధిస్తే రాబోయే రోజుల్లో  రూ. 40 నుంచి 43 మధ్యనే ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు వర్గాలు అంటున్నాయి. అలాకాని పక్షంలో గోదుమల తరహాలోనే చక్కెర ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం వార్తలు బటయకు రావడంతో స్టాక్‌ మార్కెట్‌లో చక్కెర కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. 

చదవండి: మూడు రెట్లు పెరిగిన నష్టాలు,షేర్లు జంప్‌, టార్గెట్‌ ఎంతంటే?

మరిన్ని వార్తలు