శాటిలైట్‌ సర్వీసుల కోసం 27.5 గిగాహెట్జ్‌ స్పెక్ట్రం!

1 May, 2022 14:06 IST|Sakshi

త్వరలో నిర్వహించబోయే వేలంలో 27.5–28.5 గిగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయించకపోవచ్చని తెలుస్తోంది. దీన్ని శాటిలైట్‌ సర్వీసుల (టీవీ,రేడియో, ఇంటర్నెట్‌) కోసం పక్కన పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫ్రీక్వెన్సీని  మొబైల్, శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలకు కూడా ఉపయోగించుకోవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కేంద్రానికి సూచించింది.

అయితే, 5జీ, శాటిలైట్‌ ట్రాన్స్‌మిటర్లు పక్కపక్కనే పని చేయడం కుదరదని, ఫలితంగా ఒకే ఫ్రీక్వెన్సీని రెండు రకాల సర్వీసుల కోసం షేర్‌ చేసుకోవడం కష్టంగా ఉంటుందని టెలికం శాఖ భావిస్తున్నట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. అయితే, ఇవన్నీ వదంతులేనని టెలికం శాఖ వర్గాలు కొట్టిపారేశాయి. దీనిపై డిపార్ట్‌మెంట్‌లో పలు అభిప్రాయాలు ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి.

 5జీ తదితర సేవల కోసం వివిధ ఫ్రీక్వెన్సీల్లోని స్పెక్ట్రంను దాదాపు 7.5 లక్షల కోట్లకు వేలం వేయవచ్చంటూ ట్రాయ్‌ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పెక్ట్రం ధర చాలా ఎక్కువగా ఉందంటూ టెల్కోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 
 

మరిన్ని వార్తలు