కోల్‌ ఇండియా @ రూ. 225

1 Jun, 2023 06:26 IST|Sakshi

3 శాతం ప్రభుత్వ వాటా విక్రయం

నేటి నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ షురూ

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్‌ ధరను నిర్ణయించింది. నేడు(జూన్‌ 1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం(2న) రిటైలర్లకు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)ను చేపడుతోంది. ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం తొలుత 1.5 శాతం వాటాకు సమానమైన 9.24 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అత్యధిక స్పందన లభిస్తే మరో 1.5 శాతం వాటాను సైతం విక్రయించేందుకు గ్రీన్‌ షూ ఆప్షన్‌ ఎంచుకుంది.

వెరసి కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తోంది. ఆఫర్‌ ధర ప్రకారం ప్రభుత్వం విక్రయిస్తున్న వాటాకు రూ. 4,158 కోట్లు లభించనున్నాయి. వెరసి ఈ ఏడాది(2023–24) తొలిసారి పీఎస్‌యూలో ప్రభుత్వం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే.

బీఎస్‌ఈలో బుధవారం కోల్‌ ఇండియా షేరు 1.3 శాతం నష్టంతో రూ. 241 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్‌లో ఓఎఫ్‌ఎస్‌ ప్రారంభంకానుంది.

మరిన్ని వార్తలు