ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్

8 Jun, 2021 17:44 IST|Sakshi

మన దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకి భగ్గుమంటున్నాయి. దేశంలోనే చాలా రాష్ట్రాలలో ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ కూడా కొట్టేశాయి. దీంతో చమురు కంపెనీలకు చెక్ పెట్టేందుకు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ని గుర్తించిన అనేక విదేశీ కంపెనీలు ఇప్పటికే సరికొత్త వాహనాలను ఇండియాలోకి తీసుకొస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన గో జీరో అనే కంపెనీ ఇండియాలో ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది. వీటినీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 

తక్కువ దూరం ప్రయాణించేవారికి, పట్టణ వినియోగదారుల కోసం వీటినీ తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సైకిళ్లను ఛార్జ్ చెయ్యడం కూడా చాలా తేలిక ఛార్జింగ్ చేసేందుకు పట్టే సమయం కూడా చాలా తక్కువ అని కంపెనీ తెలిపింది. ఈ సైకిళ్లలో మూడు రకాలను కంపెనీ లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.20వేల( స్కెల్లింగ్) నుంచి ఉంది. వాటిలో ప్రీమియం సైకిల్(స్కెల్లింగ్ ప్రో) ధర రూ.35వేల వరకు ఉంది. స్కెల్లింగ్ ప్రో ఎనర్డ్రైవ్ 400Wh లిథియం బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది 7-స్పీడ్ గేర్ సిస్టమ్, ముందు, వెనుక గోజెరో ప్రైవ్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. డాష్ గోజెరో డ్రైవ్ కంట్రోల్ వెర్షన్ 4.0 ఎల్‌సిడి డిస్‌ప్లే హైలైట్ చేశారు. స్కెల్లింగ్ ప్రో గంటకు 25 కి.మీ వేగంతో సింగిల్ ఛార్జీతో 70 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 0 నుంచి 90 శాతం వరకు ఛార్జింగ్ కి పట్టే సమయం సుమారు 3 గంటలు.

చదవండి: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వెబ్‌సైట్లు షట్ డౌన్

మరిన్ని వార్తలు