గ్రాసిమ్‌ విస్తరణకు రూ.3,117 కోట్లు

30 Aug, 2022 06:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు రూ.3,117 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామర్థ్యం పెంపు, ప్లాంట్ల ఆధునీకరణకు వెచ్చిస్తామని సంస్థ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా సోమవారం వెల్లడించారు. పెయింట్స్, బీటూబీ ఈ–కామర్స్‌ వ్యాపారాలు మినహా ఇతర విభాగాల్లో ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు.

‘ఇప్పటికే పెయింట్స్‌ వ్యాపారంలో రూ.10,000 కోట్ల మూలధన వ్యయానికి బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికే రూ.605 కోట్లు ఖర్చు చేశాం. అదనంగా రూ.2,000 కోట్లను బీటూబీ ఈ–కామర్స్‌ వ్యాపారానికై వెచ్చిస్తాం. 2021–22లో గ్రాసిమ్‌ రూ.1,958 కోట్లు మూలధన వ్యయం చేసింది. స్థలం దక్కించుకున్న ఆరు పెయింట్స్‌ ప్లాంట్లలో నాలుగుచోట్ల నిర్మాణం ప్రారంభం అయింది’ అని వాటాదార్ల సమావేశంలో వివరించారు.

మరిన్ని వార్తలు