Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం

29 Jun, 2021 15:58 IST|Sakshi

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఈవీ కంపెనీ గ్రావ్టన్ మోటార్స్ తన తొలి విప్లవాత్మక ఎలక్ట్రిక్ బైక్ "క్వాంటా"ను లాంఛ్ చేసింది. క్వాంటా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ బైక్‌ కేవలం రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రమోషనల్‌ ఆఫర్‌గా ధరను రూ.99,000గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వపు ‘గో ఎలక్ట్రిక్‌’ ప్లాట్‌ఫామ్‌లో క్వాంటాను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపచేసినట్లు గ్రావ్టన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురామ్‌ పాకా తెలిపారు.
   
 దీనిని పట్టణ, పల్లె ప్రాంత ప్రజల కోసం రూపొందించినట్లు సంస్థ పరశురామ్ పాకా అన్నారు. గ్రావ్టన్ మోటార్స్ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీ పరశురామ్ పాకా మాట్లాడుతూ.. "ఈ రోజు మా మొదటి ఎలక్ట్రిక్ బైక్ క్వాంటాను లాంచ్ చేయడంతో నా కల నెరవేరింది. ఈ ప్రొడక్ట్ ఎక్కువగా సెగ్మెంట్ల నుంచి రైడర్ల కొరకు రూపొందించినప్పటికి స్పోర్ట్స్ కేటగిరీలో మరొక బైక్ తీసుకొస్తున్నట్లు" ప్రకటించారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బైక్‌ కేవలం రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని తెలిపింది. బీఎల్‌డీసీ మోటర్‌ సహాయంతో దీని గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు.

దీనిని ఒక్కసారి ఛార్జ్‌చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇందులో ‎స్వాప్ ఫ్రెండ్లీ సౌకర్యం ఉంది కాబట్టి రెండు బ్యాటరీల సహాయంతో రైడర్ 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మోడ్‌లో 90 నిముషాల్లో బ్యాటరీను ఫుల్ చార్జ్ చేయవచ్చు. క్వాంటా బ్యాటరీకి 5 ఏండ్ల వారెంటీ కూడా ఉంది. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, మ్యాపింగ్‌ సర్వీస్‌ స్టేషన్స్‌,రిమోట్‌ లాక్‌/ఆన్‌లాక్‌ ఫీచర్లతో స్మార్ట్‌ యాప్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. మూడు రంగుల్లో లభించే ఈ బైక్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. 

చదవండి: 2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు

మరిన్ని వార్తలు