Mercom India: సోలార్‌ ఓపెన్‌ యాక్సెస్‌ ఇన్‌స్టలేషన్ల జోరు

29 Sep, 2021 13:24 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో సోలార్‌ ఓపెన్‌ యాక్సెస్‌ ఇన్‌స్టలేషన్లు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (2021 ఏప్రిల్‌–జూన్‌) 209 మెగావాట్లుగా ఉన్నట్టు మెర్కామ్‌ ఇండియా రీసెర్చ్‌ తెలిపింది. ‘మెర్కామ్‌ ఇడియా సోలార్‌ ఓపెన్‌ యాక్సెస్‌ మార్కెట్‌ క్యూ2 2021’ నివేదిక మంగళవారం విడుదలైంది. 

2020 రెండో త్రైమాసికంలో 27 మెగావాట్ల మేర ఇన్‌స్టాలేషన్లు నమోదైనట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. దీంతో మొత్తం మీద ఓపెన్‌ యాక్సెస్‌ మార్కెట్లో సోలార్‌ విద్యుత్‌ ఇన్‌స్టాలేషన్ల సామర్థ్యం 4.5 గిగావాట్లకు చేరుకున్నట్టు వివరించింది. అభివృద్ధి, ఏర్పాటుకు ముందస్తు దశల్లో ఒక గిగావాట్‌ మేర సోలార్‌ ఓపెన్‌యాక్సెస్‌ ఇన్‌స్టాలేషన్లు ఉన్నట్టు తెలిపింది.

తాజా నివేదికలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా మార్కెట్లకూ కవరేజీని విస్తరించినట్టు ఈ సంస్థ పేర్కొంది. ఓపెన్‌ యాక్సెస్‌ మార్కెట్‌ అన్నది.. ఒక మెగావాట్‌ కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే కంపెనీలు బహిరంగ మార్కెట్‌ నుంచే తమకు నచ్చిన సంస్థ నుంచి కొనుగోలు చేసుకునేందుకు వీలు కల్పించేది. ఈ మార్కెట్‌ కోసం ఏర్పాటయ్యే ఇన్‌స్టాలేషన్లను.. ఓపెన్‌ యాక్సెస్‌ సోలార్‌ ఇన్‌స్టాలేషన్లుగా అర్థం చేసుకోవాలి. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల త్రైమాసికం వారీగా చూస్తే (ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌) సోలార్‌ ఇన్‌స్టాలేషన్లు జూన్‌ త్రైమాసికంలో 50 శాతం తగ్గినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో 628 మెగావాట్ల మేర సోలార్‌ ఓపెన్‌ యాక్సెస్‌ ఇన్‌స్టాలేషన్లు నమోదైనట్టు తెలిపింది.  

రాష్ట్రాల వారీగా..  
2021 జూన్‌ నాటికి ఉత్తప్రదేశ్‌ రాష్ట్రం సోలార్‌ ఓపెన్‌ యాక్సెస్‌ ఇన్‌స్టాలేషన్ల సామర్థ్యంలో ముందుంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు మొత్తం ఓపెన్‌ యాక్సెస్‌ ఇన్‌స్టాలేషన్లలో 83 శాతం వాటా కలిగి ఉన్నాయి. సోలార్‌ ఓపెన్‌ యాక్సెస్‌కు కర్ణాటక అతిపెద్ద రాష్ట్రంగా ఉంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు కలసి మొత్తం ఓపెన్‌ యాక్సెస్‌ మార్కెట్లో 73 శాతం వాటాను ఆక్రమించాయి. ఒక్కో యూనిట్‌కు సగటు టారిఫ్‌ రూ.3.50–5 రూపాయల మధ్య ఉన్నట్టు మెర్కామ్‌ నివేదిక తెలియజేసింది. 

చదవండి: తిరుపతిలో సౌరకాంతులు

మరిన్ని వార్తలు