డిసెంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.29 లక్షల కోట్లు

2 Jan, 2022 05:27 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కింద 2021 డిసెంబరు నెలలో రూ, 1,29,780 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, పన్ను ఎగవేతల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇది సాధ్యమైందని ఆర్థిక శాఖ శనివారం పేర్కొంది. సీజీఎస్‌టీ కింద రూ. 22,578 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రూ. 28,658 కోట్లు, ఐజీఎస్‌టీ కింద రూ. 69,155 కోట్లు, సెస్‌ కింద రూ.9,389 కోట్లు వసూలైనట్లు వివరించింది.

కిందటి ఏడాదితో పోలిస్తే డిసెంబరు పన్ను ఆదాయంలో 13 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. 2021లో వరుసగా ఆరో నెల కూడా జీఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటడం గమనార్హం. అయితే నవంబరులో రూ. 1.31 లక్షల కోట్లు వసూలు కాగా... డిసెంబరులో ఇది రెండు వేల కోట్లు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సగటున నెలకు రూ.1.10 లక్షల కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 1.15 లక్షల కోట్లు వసూలు కాగా... మూడో త్రైమాసికంలో నెలవారీ సగటు బాగా పెరిగి రూ.1.30 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు 2020 డిసెంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 6% వృద్ధితో తెలంగాణలో రూ.3,760 కోట్లు, –2% తగ్గుదలతో ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,532 కోట్లు వసూళ్లయ్యాయి. 

చదవండి: గడువు(డిసెంబ‌ర్ 31)లోపు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది?

మరిన్ని వార్తలు