ఏప్రిల్‌ జీఎస్‌టీ గడువు పొడిగింపు

18 May, 2022 08:45 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) పోర్టల్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఏప్రిల్‌ నెల జీఎస్‌టీఆర్‌–3బీ ఫారం దాఖలుకు గడువును మే 24 వరకూ కేంద్రం పొడిగించింది. అలాగే సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ పోర్టల్‌ను తీర్చిదిద్దిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ను ఆదేశించింది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ మేరకు ట్వీట్‌ చేసింది. అంతకు ముందు .. ఏప్రిల్‌ నెల జీఎస్‌టీఆర్‌–2బీ జనరేట్‌ కావడంలోనూ, జీఎస్‌టీఆర్‌–3బీ ఆటోమేటిక్‌గా రూపొందటంలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఇ న్ఫీ రిపోర్ట్‌ చేసినట్లు సీబీఐసీ తెలిపింది. దీం తో సదరు లోపాలను సరిచేయాలంటూ కంపెనీని ప్రభుత్వం ఆదేశించిందని, సాంకేతిక బృందం దీనిపై పని చేస్తోందని ఒక ట్వీట్‌లో పేర్కొంది. 

వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ప్రతి నెలా 20, 22, 24 తారీఖుల్లో జీఎస్‌టీఆర్‌–3బీని దాఖలు చేయాల్సి ఉంటుంది. విక్రయాలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌–1 ఆధారంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) స్టేట్‌మెంట్‌ అయిన జీఎస్‌టీఆర్‌–2బీ రూపొందుతుంది. ఇది తదుపరి నెల 12వ రోజు నాటికి వ్యాపార సంస్థలకు అందుబాటులోకి వస్తుంది. పన్నుల చెల్లింపు సమయంలో ఐటీసీని క్లెయిమ్‌ చేయడానికి, జీఎస్‌టీఆర్‌–3బీని దాఖలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.  

చదవండి: పప్పు, ఉప్పు, సబ్బు.. ధరలన్నీ మండుతున్నాయ్‌

మరిన్ని వార్తలు