GST: స్విగ్గీ, జొమాటోలు ఇక రెస్టారెంట్ల పరిధిలోకి! కీలక నిర్ణయం తీసుకోనున్న జీఎస్టీ కౌన్సిల్‌

16 Sep, 2021 09:30 IST|Sakshi

జీఎస్టీ కౌన్సిల్‌ అనూహ్య నిర్ణయానికి సిద్ధమైంది. ఫుడ్‌ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్స్‌ పరిధిలోకి తీసుకురాబోతోంది.  జీఎస్టీ విధించే ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు  సమాచారం. ఈ మేరకు ఇక మీదట ఫుడ్‌ డెలివరీ యాప్‌లకు 5 శాతం జీఎస్టీ విధించే దిశగా ఆలోచన చేస్తోంది.
 

ఈ-కామర్స్‌ ఆపరేటర్లైన ఫుడ్‌ డెలివరీ సర్వీసులు..  జొమాటో, స్విగ్గీలాంటి ఫుడ్‌ సర్వీస్‌ స్టార్టప్‌లకు జీఎస్టీ భారం తప్పేలా కనిపించడం లేదు. శుక్రవారం(సెప్టెంబర్‌ 17న) లక్నోలో జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించబోయే 48 ప్రతిపాదనల్లో.. ఫుడ్‌ డెలివరీ యాప్‌లపైనా జీఎస్టీ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్‌ గనుక ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపితే..  ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్‌ పరిధిలోకి తీసుకొచ్చి మరీ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తారు.

భారీ నష్టం కారణంగానే..
ఒకవేళ  ఈ నిర్ణయం గనుక అమలు చేస్తే.. సాఫ్ట్‌వేర్‌లు అప్‌డేట్‌ చేసుకోవడానికి సదరు యాప్‌లకు కొంత టైం ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్‌ బావిస్తోంది.  ఇక నిర్ణయం వల్ల కస్టమర్లపై ఎలాంటి భారం ఉండబోదని చెబుతోంది.  ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రూల్స్‌ ప్రకారం..  ఫుడ్‌ డెలివరీ యాప్‌లను ట్యాక్స్‌ కలెక్టర్స్‌ ఎట్‌ సోర్స్‌గా భావిస్తున్నారు. అయితే గత రెండేళ్లలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్‌ల అండర్-రిపోర్టింగ్ కారణంగా ఖజానాకు పన్ను నష్టం రూ .2,000 కోట్లు వాటిల్లినట్లు కేంద్రం లెక్కగట్టింది!. రెస్టారెంట్‌ కార్యకలాపాలను అన్‌రిజిస్ట్రర్‌ పద్ధతిలో నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ట్యాక్స్ తక్కువే అయినా.. డెలివరీ వాల్యూమ్స్ ఎక్కువ కాబట్టి పన్ను ఎగవేత మొత్తం కూడా గణనీయమైనదిగా భావిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అందుకే జీఎస్టీ విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

చదవండి: జొమాటో అతలాకుతలం

మరిన్ని వార్తలు