జీఎస్టీ శ్లాబులో మార్పులు, చేర్పులు... దానిని తొలగించే అవకాశం...!

17 Apr, 2022 12:27 IST|Sakshi

వచ్చే నెలలో జరిగే జీఎస్టీ సమావేశంలో కౌన్సిల్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  జీఎస్టీలోని 5 శాతం శ్లాబ్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంది. ఈ శ్లాబ్స్ లోని కొన్ని వస్తువులను  3 శాతానికి, మిగిలినవి 8 శాతం గా నిర్ణయించే అవకాశం ఉంది.

ప్రస్తుతం జీఎస్టీ అనేది 5, 12, 18, 28 శాతం నాలుగు అంచెల నిర్మాణంగా ఉంది.  అంతేకాకుండా బంగారం, బంగారు ఆభరణాలపై 3 శాతం పన్ను విధిస్తారు. అదనంగా, లెవీని ఆకర్షించని బ్రాండెడ్,  ప్యాక్ చేయని ఆహార పదార్థాలు వంటి వస్తువులపై కూడా మినహాయింపు  ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని ఆహారేతర వస్తువులను 3 శాతం శ్లాబ్‌కు తరలించడం ద్వారా మినహాయింపు వస్తువుల జాబితాను తగ్గించే నిర్ణయం కౌన్సిల్ తీసుకోవచ్చునని సంబంధిత  వర్గాలు తెలిపాయి. ఇక 5 శాతం  శ్లాబ్‌ను 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచడంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో  కేంద్ర,  రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్‌టి కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది.  లెక్కల ప్రకారం, ప్రధానంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌తో కూడిన 5 శాతం శ్లాబ్‌లో ప్రతి 1 శాతం పెరుగుదల సుమారుగా ఏటా రూ. 50,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందుతుంది. దీంతో ఆయా ప్యాకేజ్డ్ ఫుడ్ ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం వచ్చే నెల ప్రారంభంలో మార్పులకు సంబందించిన సిఫార్సులను ఖరారు చేసే అవకాశం ఉంది, ఇక తుది నిర్ణయం కోసం మే మధ్యలో జరిగే తదుపరి సమావేశంలో కౌన్సిల్ ముందు ఉంచబడుతుంది.

మరిన్ని వార్తలు