జీఎస్‌స్టీ నుంచి లబ్ధిపొందేలా వేలకోట్ల ఫేక్‌ ఇన్వాయిస్‌లు

14 Jan, 2022 21:35 IST|Sakshi

జీఎస్‌స్టీ నుంచి లబ్ధి పొందే వేలకోట్ల ఫేక్‌ ఇన్వాయిస్‌లు జారీ చేసిన నిందితుణ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వస్తు,సేవల పన్ను కింద ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాలను పొందేందుకు రూ.4,521కోట్ల ఫేక్‌ ఇన్‌వాయిస్‌లు జారీ చేసేందుకు సిండికేట్‌ను నిర్వహిస్తున్న ఓ నిందితుణ్ని జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. 

ఈ సిండికేట్ ద్వారా 636 సంస్థల ఆడిట్‌ నిర్వహిస్తున్నట్లు పరిశీలనలో తేలిందని, ఈ సంస్థల్లో కేవలం ఇన్‌వాయిస్‌లు మాత్రమే జారీ చేశామని, వాటికి వ్యతిరేకంగా ఎలాంటి వస్తువులను సరఫరా చేయలేదని సిండికేట్ నిర్వహించే సూత్రధారి అంగీకరించారని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు.

నిందితులు దాదాపు రూ.4,521 కోట్ల పన్ను విలువతో కూడిన ఇన్‌వాయిస్‌లను జారీ చేశారు. ఇందులో దాదాపు రూ. 741 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రభావం ఉందని ప్రకటన పేర్కొంది. విచారణ సమయంలో  ఈ సంస్థల ఐటీసీ లెడ్జర్‌లో అందుబాటులో ఉన్న ఐటీసీని తిరిగి మార్చడం ద్వారా రూ.4.52 కోట్ల జీఎస్టీ జమ చేయబడింది. ఇంకా, ఇప్పటి వరకు, ఈ సంస్థల యొక్క వివిధ బ్యాంకు ఖాతాలలో ఉన్న సుమారు రూ. 7 కోట్లను స్తంభింపజేసినట్లు పేర్కొంది.

జనవరి 13న నిందితుల అరెస్ట్‌ 
ఈ నకిలీ సంస్థల వెనుక సూత్రధారిని పట్టుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు జనవరి 6న ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రొప్రైటర్ తన సర్వర్‌లలో 'క్లౌడ్ స్టోరేజ్' సేవలను వివిధ కస్టమర్‌లకు వారి ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు తాము గుర్తించిన తెలిపారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న సర్వర్‌లలో పరిశీలించగా అందులో కొన్ని సంస్థల వివరాలు టాలీ డేటాలో వెలుగులోకి వచ్చాయని సోదా నిర్వహించిన అధికారులు తెలిపినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఒక సిండికేట్ ఈ ఆడిట్‌ డేటాను నిర్వహిస్తోందని, దాని తర్వాత జనవరి 10న కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జీఎస్టీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతేకాదు నిందితుల నుంచి భారీఎత్తున సిమ్‌కార్డ్‌లు, కుంభకోణాలకు పాల్పడినట్లు గుర్తించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే స్కీమ్, రిస్క్ లేకుండా అధిక వడ్డీతో..

మరిన్ని వార్తలు