భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఒక్క నెలలో 1.80 లక్షల కోట్లపైనే

1 May, 2023 18:37 IST|Sakshi

గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ) వసూళ్లలో సరికొత్త రికార్డ్‌లు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.1.87లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 

2022 కంటే ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వసూలైన జీఎస్టీ ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌ 2022లో వసూలైన జీఎస్టీ 12 శాతంతో రూ.19,495 కోట్లు కాగా.. ఇక గత నెల 20వ తేదీన ఒక్కరోజే వసూలు చేసిన జీఎస్టీ రూ.68,228 కోట్లని కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 2023 ఆదాయం గత ఏడాది ఇదే నెలలో జీఎస్‌టీ ఆదాయం కంటే 12 శాతం ఎక్కువ అని ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) ఒక ప్రకటనలో వెల్లడించింది. 

రాష్ట్రాల వారీగా జీఎస్‌టీ వసూళ్లను పరిశీలిస్తే 

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో సిక్కిం రాష్ట్రం 61 శాతం వృద్దితో రూ.426 కోట్లను వసూలు చేయగా.. ఆ మొత్తం 2022లో రూ.264 కోట్లుగా ఉంది. దీంతో జీఎస్టీ వృద్ధి పరంగా గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల కంటే సిక్కిం ముందంజలో ఉంది. 

4 శాతం వృద్దితో 2022 ఏప్రిల్‌ నెలలో గుజరాత్‌లో రూ.11,264 కోట్లు వసూళ్లు కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ రూ.11,721కోట్లు వసూలయ్యాయి.  

హర్యానా రాష్ట్రం 22 శాతం వృద్దితో ఈ ఏప్రిల్‌ నెలలో రూ.10,035 కోట్లను వసూలు చేసింది. గత ఏడాది ఇదే ఏప్రిల్‌ నెలలో రూ.8,197 కోట్లు వసూళ్లు జరిగాయి.

మరిన్ని వార్తలు