జీఎస్‌టీ వసూళ్లలో నూతన రికార్డు

1 Feb, 2021 00:18 IST|Sakshi

జనవరిలో రూ.1.20 లక్షల కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం నూతన గరిష్టాలకు చేరింది. 2021 జనవరి నెలకు రూ.1.20 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘2021 జనవరి నెలకు జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1,19,847 కోట్లు (జనవరి 31 సాయంత్రం 6 గంటల సమయానికి) వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్‌టీ రూ.21,923 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.29,014 కోట్లు ఐజీఎస్‌టీ రూ.60,288 కోట్లు (ఇందులో దిగుమతులపై వచ్చిన రూ.27,424 కోట్లు కూడా) వసూలైంది. మరో రూ.8,622 కోట్లు సెస్సు రూపంలో వచ్చింది’’ అంటూ ఆర్థిక శాఖ వెల్లడించింది. మరిన్ని జీఎస్‌టీ విక్రయ రిటర్నులు నమోదైతే వసూళ్ల ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత 5 నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు పుంజుకుంటున్న ధోరణి జనవరిలోనూ కొనసాగినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు