'మమ్మల్ని ఆదుకోండి సార్',కేంద్రం తలుపు తట్టిన చమురు కంపెనీలు!

3 Jun, 2022 09:25 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ, పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలు వరుసగా రెండు నెలల పాటు ఎటువంటి మార్పు ల్లేకుండా కొనసాగించడం వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ) చెబుతున్నాయని  పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. ఈ విషయంలో తమకు ఉపశమనం కావాలంటూ అవి ప్రభుత్వం తలుపు తట్టినట్టు చెప్పారు. లీటర్‌ పెట్రోల్‌పై రూ.17.10, డీజిల్‌పై రూ.20.40 చొప్పున నష్టాలను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. 

ప్రైవేటు చమురు రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి, రిఫైన్డ్‌ చేసిన తర్వాత అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయన్న వార్తలపై స్పందించారు.

అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల చమురు, గ్యాస్‌ కంపెనీలు ఆర్జించే అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించడం అన్నది ఆర్థిక శాఖ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. మన కార్పొరేట్‌ సంస్థలు అన్నీ బాధ్యతగానే పనిచేస్తాయన్నారు. గత నెలలో పెట్రోల్‌ లీటర్‌పై రూ.8, డీజిల్‌ లీటర్‌పై రూ.6 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ పన్నును తగ్గించడం తెలిసిందే. 

చమురు కంపెనీలు దీన్ని తమ నష్టాల భర్తీకి సర్దుబాటు చేసుకోకుండా.. వినియోగదారులకు బదిలీ చేయడం గమనార్హం. ప్రైవేటులో రిలయన్స్‌ బీపీ, నయాయా ఎనర్జీ (షెల్‌)కి మాత్రమే రిఫైనరీలు, దేశవ్యాప్తంగా పెట్రోల్‌ విక్రయ కేంద్రాలు ఉండడం గమనార్హం. ధరలు పెరగడంతో ఇవి స్థానికంగా విక్రయాలు తగ్గించుకుని.. ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు