ఇది చాలా సీరియస్‌ ప్రాబ్లెమ్‌.. పట్టించుకోక పోతే అంతే సంగతులు

20 Jun, 2022 09:22 IST|Sakshi

దేశంలో చాప కింద నీరులా నిరుద్యోగం విస్తరిస్తోంది. అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళన హింస నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతున్నాయి. ఉద్యోగాల కోసం ఇంతలా యువత ఎదురు చూస్తుంటే మరోవైపు చేస్తున్న పనిలో మజా రావడం లేదంటూ ఉద్యోగాలను వదిలేస్తున్న ట్రెండ్‌ కూడా కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు భిన్నమైన దృశ్యాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. 

కరోనా సంక్షోభ సమయంలో ఎడ్యుటెక్‌ కంపెనీలు తామరతంపరలా పుట్టుకొచ్చాయి. ఆన్‌లైన్‌ క్లాసుల పద్దతి ఏడాదికి పైగా కొనసాగడంతో వీటికి మంచి ఊపు లభించింది. దేశం నలుమూలల అనేక మంది ఈ ఎడ్యుటెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. తమ భవిష్యత్తుకి బంగారు బాటలు పడ్డాయనే భావనలో మునిగిపోయారు. కానీ కొద్ది రోజులకే పరిస్థితి తారుమారైంది. రెగ్యులర్‌ క్లాసులు ప్రారంభంకాగానే ఎడ్యుటెక్‌ కంపెనీల పునాదులు కదిలిపోవడం మొదలైంది. ఫలితంగా అనేక కంపెనీల్లో కొత్తగా పుట్టుకొచ్చిన ఉద్యోగాలు గోవిందా అయ్యాయి.

అలా పని చేయలేం
కోవిడ్‌ 19 కారణంగా సోషల్‌ డిస్టెన్స్‌ అనేది తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. దీంతో అనేక కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం / రిమోట్‌ వర్క్‌ కల్చర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ముఖ్యంగా ఐటీ ఆధారిత కంపెనీలు అయితే వర్క్‌ ఫ్రం హోంను తమ భుజాలపై మోశాయి. కానీ కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టగానే ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయ్‌. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోంది. బలవంతంగా ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తామనే ప్రొఫెషనల్స్‌ పెరిగిపోతున్నారు.

సరికొత్త సమస్య
కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో కొత్త సమస్యలు పుట్టుకువస్తున్నాయి. ఉద్యోగాలు లేక కొందరు వెతలు అనుభవిస్తుంటే తమకు కంఫర్ట్‌ మిస్‌ అవుతున్నామంటూ మరికొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆర్థిక అంశాలు, లాజిస్టిక్స్‌, భౌతిక అంశాలతో ముడిపడిన అంశాలు. కానీ వీటికి భిన్నంగా సరికొత్త సమస్యను మన ముందుకు మోసుకు వచ్చారు ఆర్పీజీ గ్రూపు చైర్మన్‌ హార్ష్‌ గోయెంకా.

మజా లేదంటూ
సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటూ సమాకాలిన అంశాలపై స్పందించే హార్ష్‌ గోయెంకా మరో అంశాన్ని మన ముందుకు తెచ్చారు. రాజేశ్‌ అనే ఉద్యోగి ఇటీవల తన రాజీనామా చేశారు. పని చేస్తున్న చోట మజా దొరకడం లేదు కాబట్టి రిజైన్‌ చేస్తున్నట్టు సింపుల్‌గా తేల్చేశాడు అతను. సుత్తి లేకుంటా సూటిగా రెండంటే రెండు రెండు ముక్కల్లో విషయం చెప్పేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

సీరియస్‌ ఇష్యూ
మజా లేదనే కారణంతో ఉద్యోగాన్ని వదులుకోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారను హార్ష్‌ గోయెంకా. పని చేసే చోట ఉత్సాహం, ప్రోత్సాహాం, స్ఫూర్తి లాంటివి కరువైపోవడం సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అంటూ తేల్చిచెప్పారు. ఇతర కంపెనీల్లో కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకుని ఉద్యోగుల్లో ఉత్సాహం నింపుతూ ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకు వచ్చేలా వ్యూహాలు రూపొందించాలనే విధంగా హెచ్చరికలు జారీ చేశారు.

చదవండి: మీ పర్‌ఫార్మెన్స్‌ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు!

>
మరిన్ని వార్తలు