సారీ బాస్‌.. ఇలా అయితే కష్టం! కంపెనీలకు గుడ్‌ బై అంటున్న ఉద్యోగులు!!

22 Jun, 2022 20:01 IST|Sakshi

ఇటీవల కాలంలో ఉద్యోగులు ఒక సంస్థను వీడి మరో సంస్థలో చేరడం (ఆట్రిషన్‌ రేట్‌) విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు నిరుద్యోగ సమస్య పీడిస్తున్నా.. ఉద్యోగాల్లో ఉన్న వారు మేనేజ్‌మెంట్‌ పట్ల సౌకర్యంగా ఫీలవకపోతే సంస్థలను వీడేందుకు వెనుకడాటం లేదు. ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థలైతే దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయాల్సి వస్తోంది. దీనికి వ్యతిరేకంగా లేబర్‌ ఆఫీసుల చుట్టు తిరగాల్సి వస్తోంది. 

సోషల్‌ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించే ఆర్‌పీజీ గ్రూపు చైర్మన్‌ హార్ష్‌ గోయెంకా కార్పొరేట్‌ సెక్టార్‌ ఎదుర్కొంటున్న సీరియస్‌ సమస్యను ఈసారి లేవనెత్తారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతున్న వీడియో ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. వర్క్‌ఫోర్స్‌కి సంబంధించి ఇండియాలో మూడు రెవల్యూషన్స్‌ వచ్చాయని. ఒక్కో రెవల్యూషన్‌ అప్పుడు వర్క్‌ఫోర్స్‌ పనితీరు ఎలా ఉందో, వాళ్లు ఏం ఆశిస్తున్నారనే అంశాలను ఈ వీడియోలో సవివరంగా చర్చించారు.

ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌ 
స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవంతో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో ఎన్ని గంటలైనా పని చేసేందుకు  ఉద్యోగులు సిద్ధంగా ఉండేవారు. యజమానులు కొట్టినా తిట్టినా పడేవారు. అవకాశాలు తక్కువగా ఉండటంతో ఎన్నో ఇబ్బందుల నడుమ ఆరోజుల్లో ఉద్యోగులు పని చేయాల్సి వచ్చేది. వేరే జాబ్‌ దొరికే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండేవారు తప్పితే సంస్థలను వీడాలనే ఆలోచనే వచ్చేది కాద ఆ తరం వారికి. ఉపాధి కల్పించే సంస్థ పట్ల ప్రేమాభిమానాల కంటే భయమే ఎక్కువగా ఉండేది.

ఇన్ఫర్మేషన్‌ రెవల్యూషన్‌ 
90వ దశకం తర్వాత క్రమంగా ఐటీ రంగం పుంజుకోవడం మొదలైంది. ఇన్ఫర్మేషన్‌ రెవల్యూషన్‌ వచ్చాక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఈ తరుణంలో వచ్చిన వర్క్‌ఫోర్స్‌ కనీస అవసరాల కోసం కాకుండా మెరుగైన జీవితం (స్టాండర్డ్ లైఫ్‌స్టైల్‌) లక్ష్యంగా పని చేయడం మొదలైంది. వీళ్లకు కార్‌ ఈఎంఐ, హౌజ్‌ ఈఎంఐ, చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అనేవి ప్రధాన సమస్యలు. అవకాశం ఉంటే వేరే చోటుకి వెళ్లేందుకు ఆలోచించేవారు. ఎక్కువ శాతం సంస్థను వీడేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ సంస్థ పట్ల భయం అనేది పోయింది. అయితే పని చేసే సంస్థ పట్ల నమ్మకం ఉండేది.


 
సోషల్‌ రెవల్యూషన్‌
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం సోషల్‌ రెవల్యూషన్‌ వచ్చింది. ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులు ఉద్యోగ భద్రత , స్టాండర్డ్‌ లైఫ్‌ వంటి బెంచ్‌మార్క్‌లను దాటి పోయారు. ఇప్పటి వర్క్‌ఫోర్స్‌ క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ని కోరుకుంటున్నారు. ఈ క్వాలిటీ అనేది పని, పని ప్రదేశం, యాజమాన్యం ప్రవర్తన వంటివి కోరుకుంటున్నారు. క్వాలిటీలో ఏ మాత్రం తేడా వచ్చిన కంపెనీ వదిలి వెళ్లేందుకు వెనుకాడటం లేదు. ఉద్యోగాలిచ్చే సంస్థల పట్ల భయం, నమ్మకం వంటివాటికి ఇక్కడ చోటు లేదు. పరస్పర గౌరవం, ఆదరణ ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.

చిన్న చూపు తగదు
ఏ సంస్థ అయినే సరే ఉద్యోగం ఇచ్చామనో, మంచి జీతం ఇస్తున్నామనే భావనలో ఉంటే ఆ కంపెనీలు ఉద్యోగుల వలస అనే సమస్యను ఎదర్కోక తప్పదని హార్ష్‌ గోయెంకా షేర్‌ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ తరం వర్క్‌ఫోర్స్‌ ఉద్యోగ భద్రత, మంచి జీతంతో పాటు క్వాలిటీ ఆఫ్‌ వర్క్‌ను కూడా కోరుకుంటున్నారు. పనితీరును గమనించి ప్రోత్సహకాలు అందివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సరైన సమయంలో వేతనాల పెంపు ఉండాలంటున్నారు. అవి లేకుంటే అదే కంపెనీలో ఉండేందుకు రెడీగా ఉండటం లేదు.  కాబట్టి ఉద్యోగ, భద్రత జీతం ఇస్తున్నామని ఇంకే కావాలని ఆలోచించే కంపెనీలను వదిలి వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల విషయంలో జాగ్రత్త మెసలుకోవాలంటే యాజమాన్యాలకు సూచన చేశారు.

చదవండి: మహ్మద్‌ రఫీ పాటనే స్ఫూర్తిగా.. వేల కోట్లకు అధిపతిగా..

మరిన్ని వార్తలు