హెచ్‌సీఎల్‌ టెక్‌ పుష్‌- ఐటీ దూకుడు

14 Sep, 2020 12:03 IST|Sakshi

క్యూ2లో మెరుగైన ఫలితాలు: హెచ్‌సీఎల్‌ టెక్‌ తాజా అంచనాలు

10 శాతం హైజంప్‌ - సరికొత్త గరిష్టానికి హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు

సాఫ్ట్‌వేర్‌ కౌంటర్లకు డిమాండ్‌- 52 వారాల గరిష్టాలకు పలు షేర్లు

టీసీఎస్‌ 3 శాతం అప్‌- రూ. 9 లక్షల కోట్లను దాటిన మార్కెట్‌ విలువ

ఇన్ఫోసిస్‌ చేతికి గైడ్‌విజన్‌- 4 శాతం ఎగసిన ఎన్‌ఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌

ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తాజాగా అభిప్రాయపడింది. ఆదాయం, నిర్వహణ మార్జిన్లు అంచనాల(గైడెన్స్‌)ను అందుకోనున్నట్లు పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 3.5 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇబిట్‌ మార్జిన్లు 20.5-21 శాతం స్థాయిలో నమోదుకావచ్చని తెలియజేసింది. దీంతో ఐటీ రంగంపై ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోవైపు యూరోపియన్‌ సంస్థ గైడ్‌విజన్‌ను సొంతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ తాజాగా వెల్లడించింది. ఎంటర్‌ప్రైజ్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సేవలందించే ఈ యూరోపియన్‌ కంపెనీ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఫలితంగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌తోపాటు.. సాఫ్ట్‌వేర్‌ సేవల ఇతర కంపెనీలకూ డిమాండ్‌ పెరిగినట్లు తెలియజేశారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ ఏకంగా 4.5 శాతం ఎగసింది.

టీసీఎస్‌ రికార్డ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరు 9.6 శాతం దూసుకెళ్లింది. రూ. 789 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. టీసీఎస్‌ 3 శాతం ఎగసింది. రూ. 2,447 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అంతేకాకుండా టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ. 9 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి ఆర్‌ఐఎల్‌ తదుపరి అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీగా రికార్డు సాధించింది.

జోరుగా హుషారుగా
ఐటీ సేవల ఇతర కంపెనీలలో ఎంఫసిస్‌ 8.4 శాతం జంప్‌చేసి రూ. 1251ను తాకింది. తొలుత రూ. 1,270 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఈ బాటలో మైండ్‌ట్రీ 3.7 శాతం ఎగసి రూ. 1227 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ఇన్ఫోసిస్‌ 4 శాతం దూసుకెళ్లి రూ. 983కు చేరింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా కోఫోర్జ్‌ 3.25 శాతం లాభపడి రూ. 2158 వద్ద కదులుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. టెక్‌ మహీంద్రా 3.5 శాతం పెరిగి రూ. 792 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ 2.6 శాతం బలపడి రూ. 2564 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2564 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఐటీ దిగ్గజం విప్రో సైతం 2.75 శాతం పుంజుకుంది. రూ. 302 సమీపంలో ఏడాది గరిష్టం వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో తొలుత రూ. 1331 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకిన టాటా ఎలక్సీ 2 శాతం లాభంతో రూ. 1314 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు