కార్వీ స్కామ్‌, తీసుకున్న రుణాలు ఎగ్గొట్టేందుకు కుట్ర..?!

23 Jun, 2021 11:25 IST|Sakshi

స్కామ్‌కు పాల్పడిన షేర్‌ మార్కెట్‌ సంస్థ కార్వీ

రుణాలు తీసుకొని ఎగ్గొట్టేందుకు కుట్ర

పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన బ్యాంకులు 

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ సంస్థ కార్వీపై షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకుందని హెచ్‌డీఎఫ్‌సీ,ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లు ఫిర్యాదు చేశాయి. కార్వీపై సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ లో రెండు కేసులు నమోదయ్యాయి. షేర్లను ఉంచుకొని రుణాలు మంజూరు చేయాలని ధరఖాస్తు చేసుకొని తరువాత అసలు,వడ్డీ చెల్లించకుండా మోసం చేసిందని హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ లు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి.

రూ.329.16 కోట్ల షేర్లను తనఖా పెట‍్టి హెచ్‌డీఎఫ్‌సి వద్ద రుణం తీసుకుంటే.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ లో రూ. 137కోట్ల రుణం తీసుకొని ఎగవేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రుణం తీసుకున్న తర్వాత కొద్దినెలలు వాయిదాలు చెల్లించి రుణాల్ని ఎగవేయడంలో వెన్నతో పెట్టిన విద్య అని బ్యాంక్‌లు అంటున్నాయి. 2019 సెప్టెంబరులో కార్వీసంస్థపై ఫిర్యాదుతో రావడంతో సెబీ విచారణ జరిపి లావాదేవీలపై నిషేదం విధించింది. వినియోగదారుల షేర్లను కార్వీసంస్థ అక్రమంగా  సొంత లాభానికే వాడుకుంటుందంటూ సెబీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు నివేదిక సమర్పించింది. వందల కొద్ది షేర్లు నకిలీవి ఉన్నాయంటూ నివేదికలో తెలిపింది. దీంతో కార్వీ సంస్థ బ్యాంకుల్లో ఉంచిన షేర్ల లావాదేవీలు ఒక్కసారిగా స్తంభించాయి. 

మరోవైపు తాము ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు అవసరమైన పత్రాల్ని సమర్పించాలంటూ కార్వీ డైరెక్టర్లకు హెచ్‌డీఎఫ్‌ అధికారులు నోటీసులు పంపారు. అయితే నెలలు గడుస్తున్నా పత్రాలు ఇవ్వలేదని బ్యాంక్‌ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే రుణాల్ని ఎగవేత వేయడంతో పాటూ బ్యాంకుల్ని దారుణంగా వంచించారని, ప‍్రజల డబ్బుకు రక్షణగా ఉన్న తమపట్ల అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ కార్వీ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ రెండు బ్యాంకులు కోరాయి.   

చదవండిఅమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?!

మరిన్ని వార్తలు