ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త

6 Oct, 2022 10:38 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. కోవిడ్‌ విజృంభణ సమయంలో అత్యధికంగా వడ్డీ చెల్లించేలా సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ స్కీమ్‌ గడువును పెంచుతున్నట్లు తెలిపింది.     

సీనియర్‌ సిటిజన్ల కోసం హెచ్‌డీఎఫ్‌సీ మే 18, 2020లో ‘సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఆ ఎఫ్‌డీ పథంలో చేరిన ఖాతాదారులకు .. సాధారణ డిపాజిట్ల కంటే ఎక్కువగా వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఆ పథకంలో చేరే గడువు సెప్టెంబర్‌ 30,2022తో ముగియగా..తాజాగా ఆ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు  వెల్లడించింది.

 0.25శాతం అదనపు వడ్డీతో  
 మే 18, 2020 నుండి మార్చి 31, 2023  మధ్య కాలంలో సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీలో చేరిన ఖాతాదారులకు ఐదేళ్ల టెన్యూర్‌, లేదంటే ఒక రోజు నుంచి 10 ఏళ్ల టెన్యూర్‌ కాలానికి రూ.5కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 0.25శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. 

తేడా ఎంతంటే
ఐదు సంవత్సరాలు, ఒక రోజు నుండి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  బ్యాంకు సాధారణ వడ్డీ రేటు  5.75 శాతం అందిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కింద అదనంగా 6.50 శాతం వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లు పొందుతారు.

టెన్యూర్‌ లోపు డ్రా చేస్తే 
అయితే, పైన పేర్కొన్నట్లుగా ఐదేళ్లలోపు డిపాజిట్‌లను ప్రీ క్లోజ్‌ చేసుకుంటే బ్యాంకు లబ్ధి దారులకు చెల్లించే వడ్డీరేటులో ఒకశాతం తగ్గుతుందని,  లేదా డిపాజిట్ ఉన్న కాలానికి వర్తించే బేస్ రేటు ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

చదవండి👉 బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే!

మరిన్ని వార్తలు