పండుగ సీజన్‌.. కొత్త బైక్‌ కొనేవారికి షాక్‌!

23 Sep, 2022 11:33 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ ధరలను సవరించింది. మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధర మోడల్‌ను బట్టి రూ.1,000 వరకు పెంచింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వస్తాయని కంపెనీ గురువారం ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరగడంతో వాహన ధరలు పెంచుతున్నట్లు తెలిపింది.

పెరిగిన ధరలు మోటారు సైకిళ్లు, స్కూటర్లకు వరిస్తుందని పేర్కొంది. పండుగ సీజన్‌లో కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడం సహజం, కానీ హీరో  మోటో కార్ప్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఆగస్టులో.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1.92% పెరిగి 462,608 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. దేశీయ విక్రయాల వాల్యూమ్‌ కూడా గత ఏడాది విక్రయించిన యూనిట్లతో పోలిస్తే 4.55% పెరిగి 450,740 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే ఆగస్టు 2022లో ఎగుమతులు క్షీణించాయి.

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా హీరో మోటోకార్ప్, ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌కి ఉన్న బంకుల్లో ఈ రెండు సం​స్థలు కలిసి చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు