డిసెంబర్ 1 నుండి రూ. 1,500 వరకూ పెరుగుదల
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 1,500 వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్స్, మార్కెట్లను బట్టి పెంపు పరిమాణం ఉంటుందని సంస్థ వివరించింది.
‘ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదు’ అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ధరల భారం ప్రభావం కస్టమర్లపై ఎక్కువగా పడకుండా వినూత్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందించడం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
డిమాండ్ మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నట్లు గుప్తా వివరించారు.
చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది!