హీరో మోటోకార్ప్‌పై ఐటీ శాఖ దాడులు..! కంపెనీ ఛైర్మన్ ఇంట్లో సోదాలు

23 Mar, 2022 14:18 IST|Sakshi

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని హీరో మోటోకార్ప్ కార్యాలయంతో పాటు  సంస్థ సీఈవో పవన్ ముంజల్ నివాసంలో ప్రస్తుతం సోదాలు జరుపుతోంది.

హీరో మోటోకార్ప్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 25 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.  పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కంపెనీ, కంపెనీ ప్రమోటర్లకు చెందిన ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పత్రాలను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఆదాయ పన్ను శాఖ సోదాలపై ఇప్పటికైతే ఆ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐటీ దాడుల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ స్టాక్స్ 1.5 శాతం మేర పడిపోయాయి. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ దాదాపు 40 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో యూనిట్ వాల్యూమ్ విక్రయాల పరంగా 2001లో హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మాన్యుఫాక్చరర్‌గా నిలిచింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 100 మిలియన్ యూనిట్స్‌ విక్రయాలు చేపట్టింది. దేశీయ ద్విచక్ర వాహన తయారీ రంగంలో హీరో మోటోకార్ప్‌కి 50 శాతానికి పైగా షేర్ ఉంది. 

చదవండి: టీసీఎస్‌ సంచలనం..5జీ..6జీ!!

మరిన్ని వార్తలు