వాహనాల తయారీ నిలిపివేసిన హీరో మోటాకార్ప్

21 Apr, 2021 18:12 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కంపెనీకి చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్(జీపీసీ)తో సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని తయారీ ప్లాంట్లలో తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు హీరో మోటోకార్ప్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. రేపటి(ఏప్రిల్ 22) నుంచి మే 1 వరకు కంపెనీకి సంబంధించిన అన్ని ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది.

అయితే, ప్లాంట్లను మూసివేయడం కారణంగా వాహనాల తయారీ నిలిచిపోవడంతో ఆ ప్రభావం డిమాండ్ పై పడే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కంపెనీ మాత్రం వాహనాల తయారీని నిలిపివేయడం ద్వారా డిమాండ్ పై ఎలాంటి ప్రభావం ఉండకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ మూసివేత ద్వారా ఏర్పడే ప్రొడక్షన్ లాస్ ను భర్తీ చేస్తామన్నారు. తయారీ కర్మాగారాల్లో అవసరమైన నిర్వహణ పనులను చేపట్టడానికి కంపెనీ ఈ షట్-డౌన్ రోజులను ఉపయోగించుకొనున్నట్లు పేర్కొంది. అలాగే, కంపెనీకి చెందిన అన్ని కార్పొరేట్ కార్యాలయాలు సైతం మూసి వేసే ఉన్నాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. మళ్లీ మే 1 అనంతరం ప్రతీ ప్లాంటులోని వాహనాల తయారీ ఎప్పటిలాగే కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

చదవండి: దేశంలో బంగారం దిగుమతుల జోరు

మరిన్ని వార్తలు