ఓలా, బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా వచ్చేస్తున్న హీరో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌!

27 Feb, 2022 20:48 IST|Sakshi

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని 2022 మార్చిలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని సంస్థ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా తెలిపారు. ద్విచక్ర వాహన దిగ్గజం కూడా విస్తృత శ్రేణిలో ప్రీమియం ఎలక్ట్రిక్ ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఆటోమేకర్ తన ఎలక్ట్రిక్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు తయారీ కేంద్రంలో తయారు  చేస్తున్నట్లు పేర్కొంది. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గత కొంతకాలంగా తన ప్రతిష్టాత్మక మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ది చేస్తుంది. 

ఈ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా ఎస్1 వంటి స్కూటర్ల పోటీ పడనుంది. తమ ఎలక్ట్రిక్ వాహనాన్ని పెద ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందిస్తున్నట్లు నిరంజన్ గుప్తా పేర్కొన్నారు. ఇప్పటికే హీరో మోటోకార్ప్ కంపెనీ అథర్ ఎనర్జీ, గోగోరోలో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి హీరో మోటోకార్ప్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)తో చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హీరో  మోటోకార్ప్ ప్రీమియం పోర్ట్ ఫోలియోలో మరిన్ని ఉత్పత్తులను తయారీ చేయలని చూస్తున్నట్లు గుప్తా తెలిపారు.

(చదవండి: ఉక్రెయిన్‌ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఇంత ఖర్చు అవుతుందా?) 

మరిన్ని వార్తలు