Hero Splendor Bike: బ్యాటరీతో నడవనున్న హీరో స్ప్లెండ‌ర్ బైక్

7 Sep, 2021 18:49 IST|Sakshi
Source: Rushlane

భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనం ఏదైనా ఉంది అంటే అది హీరో స్ప్లెండర్ అని చెప్పుకోవాలి. ఈ బైక్ ధర, నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే సామాన్య ప్రజలు ఎక్కువగా కొనడానికి ఇష్ట పడతారు. అయితే, గత కొన్ని నెలల నుంచి పెట్రోల్ ధర భారీగా పెరగడంతో సామాన్యుడు ద్విచక్ర వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి భాదలు తరిమికొట్టడానికి హీరో స్ప్లెండర్ బైక్ కోసం ఈవీ కన్వర్షన్ కిట్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. (చదవండి: Tesla: భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కార్ల అమ్మకం!)

తమకు ఇష్టమైన బైక్ లో ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కిట్ ను ఆర్ టీఓ కూడా ఆమోదించింది. మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ గోగోఏ1 ఇటీవల దీనిని లాంఛ్ చేసింది, దీని ధర రూ.35,000. అయితే, అసలు మొత్తంతో పాటు రూ.6,300 జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈవీ కన్వర్షన్ కిట్, బ్యాటరీ ధర రూ.95,000. హీరో స్ప్లెండర్ బైక్ తో పాటు దీనిని కొనడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన కిట్ పై 3 సంవత్సరాల వారెంటీని కూడా అందిస్తోంది. 

రష్లేన్ ప్రకారం, గోగోఎ1 సింగిల్ ఛార్జ్ పై 151 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ప్రస్తుతం, భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు ఇటువంటి ఎలక్ట్రిక్ బైక్ లను ఇంకా లాంఛ్ చేయలేదు. అయితే, పెట్రోల్ వేరియెంట్లు భారీగా అమ్ముడు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గోగోఎ1 సంస్థ ప్రజల ముందు మంచి ఆప్షన్ ఉంచింది. కాకపోతే ఇది చాలా ఖరీదైనది అని ప్రజలు భావిస్తున్నారు. రాబోయే కాలంలో హీరో, బజాజ్, హోండా, యమహా సహా పలు ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ లను విడుదల చేయనున్నాయి.
 

మరిన్ని వార్తలు