వామ్మో ఆ కారుకి అంత డిమాండా? ఏడాదిన్నర వెయిటింగ్‌ పీరియడ్‌!!

10 May, 2022 12:36 IST|Sakshi

రా మెటీరియల్‌ కాస్ట్‌ పెరిగిందంటూ వరుసగా ఆటో మొబైల్‌ కంపెనీలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఐనప్పటికీ కార్లకున్న డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు. ఇక లేటెస్ట్‌ ఫీచర్లతో విడుదలైన కార్లను కొనుగోలు చేసేందుకయితే ప్రజలు పోటీ పడుతున్నారు. దీంతో వెయిటింగ్‌ పీరియడ్‌ పెరుగుతూ పోతోంది.

కరెన్స్‌ కావాలి
ఈ ఏడాది రిలీజైన కార్లలో అత్యధిక వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్న కారుగా కియా కరెన్స్‌ నిలుస్తోంది. ఈ కారుని 2022 ఫిబ్రవరి 15న ఇండియా మార్కెట్‌లో లాంచ్‌ చేశారు. ప్రారంభ ధరగా రూ.8.99 లక్షలుగా నిర్ణయించగా ఆ వెంటనే ధరలను సవరించి రూ.9.59 లక్షలకు పెంచారు. ఐనప్పటికీ ఈ కారుకి డిమాండ్‌ తగ్గడం లేదు. ఏప్రిల్‌ వరకు 12 వేల యూనిట్లు దేశీయంగా అమ్ముడైపోగా 50వేల కార్లకు బుకింగ్‌ జరిగింది.

కనీసం 23 వారాలు
కియా కరెన్స్‌లో ఐదే వేరియంట్లు ఉన్నాయి. ఇందులో పెట్రోల్‌/ డీజిల్‌, మాన్యువల్‌/ఆటో గేర్‌ షిఫ్ట్‌, 6/7 సీటర్‌ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో ధర తక్కుగా ఉన్న బేసిక్‌ వేరియంట్‌ అయిన ప్రీమియం 1.5 లీటర్‌ పెట్రోల్‌ మాన్యువల్‌ను సొంతం చేసుకోవాలంటే గరిష్టంగా 75 వారాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని కియా ప్రతినిధులు తెలిపారు. ఇక ఇందులో హైఎండ్‌ వేరియంట్‌ అయిన లగ్జరీ ప్లస్‌ అయితే 23 వారాల వెయింటింగ్‌ పీరియడ్‌ ఉంది.

మహీంద్రా
ఇక ఇండియాలో అత్యధిక వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్న మోడల్‌గా మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఓఓ మోడల్‌ ఉంది. లేటెస్ట్‌ ఫీచర్లతో మహీంద్రా గతేడాది రిలీజ్‌ చేసిన ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ముందస్తుగా బుకింగ్స్‌ చేసుకుంటున్నారు. దీంతో ఈ కారు పొందాలంటే 20 నెలల నుంచి రెండేళ్ల వరకు వెయింటింగ్‌ పీరియడ్‌ ఉంది. 

చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు!

మరిన్ని వార్తలు