బ్లాక్‌ కంపెనీని టార్గెట్ చేసిన హిండెన్‌బర్గ్‌.. జాక్‌ డార్సీకి షాక్!

24 Mar, 2023 08:09 IST|Sakshi

షేర్లు 20 శాతం డౌన్‌ 

న్యూఢిల్లీ: షార్ట్‌సెల్లింగ్‌ రిపోర్టుతో అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేసిన అమెరికన్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా మరో కంపెనీని టార్గెట్‌ చేసుకుంది. ఈసారి ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డార్సీకి చెందిన చెల్లింపుల కంపెనీ బ్లాక్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లను బ్లాక్‌ తప్పుదోవ పట్టించిందంటూ నివేదికను ప్రచురించింది. 1 బిలియన్‌ డాలర్ల పైగా మోసానికి పాల్పడిందంటూ ఆరోపించింది. 

దాదాపు రెండేళ్ల పరిశోధన తర్వాత ఈ రిపోర్టును రూపొదించినట్లు పేర్కొంది. ఈ నివేదికతో అమెరికా మార్కెట్లో బ్లాక్‌ షేర్లు ఒక దశలో 20 శాతం పైగా క్షీణించి 58 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అదానీ గ్రూప్‌ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్‌ ఈ ఏడాది జనవరిలో ఆరోపించడం, ఫలితంగా అదానీ సంస్థల షేర్లు భారీగా పతనం కావడం తెలిసిందే. అంతకు ముందు 2020లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్‌పై కూడా హిండెన్‌బర్గ్‌ పలు ఆరోపణలు చేసింది. దీనితో ఆ కంపెనీ షేరు పతనం కావడంతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు ట్రెవర్‌ మిల్టన్‌పై క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు