ఒక్క డబుల్‌ బెడ్రూమ్‌ రూ.60 కోట్లు!

19 Jun, 2021 00:09 IST|Sakshi
లండన్‌లోని ఓల్డ్‌ వార్‌ ఆఫీస్‌ భవనం

విక్రయానికి సిద్ధంగా లండన్‌ ఓల్డ్‌ వార్‌ ఆఫీస్‌

సేల్స్‌ పార్ట్‌నర్స్‌గా నైట్‌ఫ్రాంక్, స్ట్రట్‌ అండ్‌ పార్కర్‌

సాక్షి, హైదరాబాద్‌: లండన్‌లోని చరిత్రాత్మక ఓల్డ్‌ వార్‌ ఆఫీస్‌ (ఓడబ్ల్యూఓ) విక్రయానికి సిద్ధంగా ఉంది. 2014లో మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ నుంచి కొనుగోలు చేసిన బహుళ జాతి కంపెనీ హిందుజా గ్రూప్‌ ప్రస్తుతం దీన్ని అమ్మకానికి పెట్టింది. అధికారిక విక్రయ భాగస్వాములుగా లండన్‌కు చెందిన అతిపెద్ద ప్రాపర్టీ కన్సల్టెంట్‌ స్ట్రట్‌ అండ్‌ పార్కర్, గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ఫ్రాంక్‌లను నియమించుకుంది. ఇందులో 85 రాఫెల్స్‌ బ్రాండెడ్‌ రెసిడెన్సీలతో పాటు ఫస్ట్‌ రాఫెల్‌ లండన్‌ హోటల్‌లో 125 రూమ్స్, సూట్స్, 9 రెస్టారెంట్స్‌ అండ్‌ బార్స్, స్పాలున్నాయి. ఓడబ్ల్యూఓ రెసిడెన్సీలో స్టూడియో నుంచి ఐదు పడకగదుల నివాసాలున్నాయి. 2 బీహెచ్‌కే ధర సుమారు రూ.60 కోట్లు (5.8 మిలియన్‌ పౌండ్లు). ఇందులో ప్రైవేట్‌ ల్యాండ్‌స్కేప్‌ గార్డెనింగ్, 7 లాంజ్‌లు, ప్రైవేట్‌ డైనింగ్‌ రూమ్, సినిమా, జిమ్, 3 ట్రైనింగ్‌ స్టూడియోలు, 20 మీ. హోటల్‌ పూల్, 9 రెస్టారెంట్స్‌ వంటి నివాసితులకు ప్రైవసీ, సెక్యూరిటీ పరమైన అన్ని రకాల విలాసవంతమైన వసతులున్నాయి.

వందేళ్ల తర్వాత సందర్శన.. 
వారసత్వ చరిత్ర, సంప్రదాయాలకు నెలవైన ఓడబ్ల్యూఓను సుమారు వంద సంవత్సరాల నుంచి ప్రజల సందర్శనను మూసివేశారు. ఆరేళ్ల క్రితం దీన్ని కొనుగోలు చేసిన హిందుజా గ్రూప్‌ ఓడబ్ల్యూఓను ఫైవ్‌ స్టార్‌ హోటల్, రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌గా అభివృద్ధి చేసింది. ప్రత్యేకమైన, చరిత్రాత్మక పునఃనిర్మాణాలలో ప్రత్యేక అనుభవం ఉన్న న్యూయార్క్‌కు చెందిన ఫ్రెంచ్‌ ఆర్కిటెక్ట్, డిజైనర్‌ థియరీ డెస్పాంట్‌ హోటల్‌ లోపలి భాగాలను డిజైన్‌ చేశారు. హిస్టారిక్‌ ఇంగ్లాండ్, మ్యూజియం ఆఫ్‌ లండన్‌ ఆర్కియాలజీ, ఈఆర్పీ ఆర్కిటెక్ట్‌లు ఓడబ్ల్యూఓ భవన పునఃనిర్మాణాభివృద్ధిని పర్యవేక్షిస్తున్నాయి. గత నలభై ఏళ్ల నుంచి ఓడబ్ల్యూఓ తమ నివాసంగా ఉందని.. ప్రస్తుత అభివృద్ధి పనులు పూర్తి చేసి.. వచ్చే ఏడాది నుంచి ప్రజల సందర్శనకు అందుబాటులోకి వస్తుందని హిందుజా గ్రూప్‌ కో–చైర్మన్‌ గోపీచంద్‌ పీ హిందుజా తెలిపారు. భారతీయ హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), సూపర్‌ రిచ్‌ కమ్యూనిటీలు తమ సెకండ్‌ హోమ్‌ కొనుగోళ్లలో యూకే మూడో స్థానంలో ఉందని.. 2019లో 79 శాతం మంది ఇండియన్‌ హెచ్‌ఎన్‌ఐలు యూకేలో పెట్టుబడులు పెట్టారని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశీర్‌ బైజాల్‌ తెలిపారు.

వారసత్వ చరిత్ర..  
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూకే ప్రధాన మంత్రులైన విన్‌స్టన్‌ చర్చిల్, డేవిడ్‌ లాయి డ్‌ జార్జ్‌లతో పాటు పలువురు రాజకీయ, సైనిక నాయకులకు ఓడబ్ల్యూఓ ప్రధా న నివాసంగా ఉండేది. మొత్తం 5.80 లక్షల చ. అ.ల్లో.. ఏడంతస్తుల భవంతి. ఇందులో మొత్తం 1,110 రూమ్స్‌ ఉంటాయి. బ్రిటీష్‌ పార్లమెంట్‌కు, ప్రధానమంత్రి నివాసానికి చేరువలో ఓడబ్ల్యూఓ ఉంటుంది.  

మరిన్ని వార్తలు