కొత్త ఏడాది ఆశావహమే

29 Dec, 2020 00:50 IST|Sakshi

ఉద్యోగాల భర్తీపై కంపెనీల మాట 

త్వరలోనే కరోనా ముందస్తు స్థాయికి: నౌకరీడాట్‌కామ్‌ సర్వే

ముంబై: కరోనా కల్లోలం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకుంటోంది. ఉద్యోగాల భర్తీ పట్ల కంపెనీలు ఆశావహంగా ఉన్నాయని, ఉద్యోగార్థులు నిరాశపడవలసిన పనిలేదని నౌకరీడాట్‌కామ్‌ తాజా సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,327 కంపెనీలు, కన్సల్టెంట్లపై నిర్వహించిన ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే...  

► రానున్న 3–6 నెలల వ్యవధిలోనే ఉద్యోగాల భర్తీ కరోనా ముందటి స్థాయికి చేరగలదని సర్వేలో పాల్గొన్న 26% కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ఉద్యోగాల భర్తీ కరోనా ముందు స్థాయికి చేరడానికి 6 నెలల నుంచి ఏడాది కాలం పడుతుందని 34% కంపెనీలు భావిస్తున్నాయి.  

► కరోనా కల్లోలం మెడికల్, హెల్త్‌కేర్, ఐటీ, బీపీఓ/ఐటీఈఎస్‌ రంగాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే రిటైల్, ఆతిథ్య, పర్యాటక రంగాలపై పెను ప్రభావమే చూపింది. అయితే ఈ రంగాలతో పాటు వాహన రంగంలో కూడా ఉద్యోగాల భర్తీ క్రమేపీ మెరుగుపడుతోంది.  

► 2020 ఆరంభంలో హైరింగ్‌ మార్కెట్‌ సానుకూలంగానే ఉంది. ఉద్యోగాల కల్పన పెరిగింది. మార్చి నుంచి కరోనా కల్లోలం ఉద్యోగ మార్కెట్‌పై ప్రభావం చూపించడం మొదలైంది. ఏప్రిల్, మే నెలల్లో హైరింగ్‌ 60 శాతం తగ్గింది. నౌకరీడాట్‌కామ్‌ ప్లాట్‌ఫార్మ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఇదే అత్యంత కనిష్ట స్థాయి.  

► నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ గత నెలలో 28 శాతం తగ్గింది. అయితే అంతకు ముందటి నెలలతో పోల్చితే ఉద్యోగాల భర్తీ క్రమక్రమంగా పెరుగుతోంది.

మరిన్ని వార్తలు