Hyderabad : ఇళ్ల కొనుగోళ్లలో అదే జోరు!

8 Dec, 2021 11:46 IST|Sakshi

కరోనా సంక్షోభం ఓ వైపు కొనసాగుతున్నా హైదరాబాద్‌ నగర పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుమీద ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సొంతింటి కలను నిజం చేసుకుంటున్న వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం.

16 శాతం వృద్ధి
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లను పెరిగాయి. జనవరి నుంచి నవంబరు వరకు కాలాన్ని పరిగణలోకిక తీసుకుంటే ఈ వృద్ధి 16 శాతంగా నమోదు అయ్యింది. 2021లో జనవరి నుంచి నవంబరు వరకు నాలుగు జిల్లాల పరిధిలో కొత్తగా 21,988 ఇళ్లు రిజిష్ట్రరేషన్‌ జరిగినట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి.

మీడియం బడ్జెట్‌
గ్రేటర్‌ పరిధిలో రిజిష్ట్రర్‌ అయిన ఇళ్ల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల బడ్జెట్‌ లోపు ఉన్న ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది అమ్ముడైన మొత్తం ఇళ్లలో ఈ సెగ్మెంట్‌ వాటా 34 శాతంగా తేలింది. గతేడాది ఇది 31 శాతానికే పరిమితమైంది. ఇక రూ. 25 లక్షలలోపు ఉన్న బడ్జెట్‌ ఇళ్ల మార్కెట్‌ను పరిశీలిస్తే గతేడాదితో పోల్చితే క్షీణత నమోదు అయ్యింది. ఈ ఏడాది బడ్జెట్‌ ఇళ్ల మార్కెట్‌ షేర్‌ 35 నుంచి 32కి పడిపోయింది. కరోనా కారణంగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ఆదాయాలు పడిపోవడంతో ఈ సెగ్మెంట్‌లో ఇళ్ల కొనుగోళ్లు కొంత మేర తగ్గాయి.

ధరల్లో మార్పు ?
ఇక కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఇళ్ల ధరల్లో పెద్దగా మార్పులు లేవు. గతేడాదితో పోల్చితే ఇళ్ల ధరలు సగటున 5.8 శాతం పెరిగాయి. ఇంటి నిర్మాణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ధరల పెరుగుదలతో పెద్ద మార్పులు లేవనే చెప్పుకోవాలి.   

చదవండి: ఇళ్ల కొనుగోలు దారులకు శుభవార్త..!

మరిన్ని వార్తలు