కొనుగోలు దారులకు షాక్‌! పెరిగిన ఇళ్ల ధరలు!

23 Mar, 2022 07:19 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో గృహాల ధరలు 2.1 శాతం మేర పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా గృహాల ధరల పెరుగుదలకు సంబంధించిన జాబితాలో భారత్‌ 56వ ర్యాంకు నుంచి 51వ స్థానానికి ఎగబాకింది.

 ’గ్లోబల్‌ హౌస్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ – క్యూ4 2021’ నివేదికలో నైట్‌ ఫ్రాంక్‌ ఈ విషయాలు వెల్లడించింది. 2020 క్యూ4లో భారత్‌ 56వ ర్యాంకులో ఉంది. వార్షిక ప్రాతిపదికన టర్కీలో గృహాల రేట్లు అత్యధికంగా 59.6 శాతం మేర పెరిగాయి. 

న్యూజిలాండ్‌ (22.6 శాతం), చెక్‌ రిపబ్లిక్‌ (22.1 శాతం), స్లొవేకియా (22.1 శాతం), ఆస్ట్రేలియా (21.8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక మలేషియా, మాల్టా, మొరాకో మార్కెట్లలో హౌసింగ్‌ ధరలు 0.7–6.3 శాతం మేర తగ్గాయి. అధికారిక గణాంకాల ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలు, ప్రాంతాల్లో ఇళ్ల ధరల వివరాలను క్రోడీకరించి నైట్‌ ఫ్రాంక్‌ ఈ నివేదిక రూపొందించింది.  

నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు ..  

డేటా ప్రకారం 56 దేశాలు, ప్రాంతాల్లో రేట్లు సగటున 10.3 శాతం మేర పెరిగాయి. 

2020 జనవరి–మార్చి త్రైమాసికంలో 2% పెరగ్గా, క్యూ2లో 1.9%, క్యూ3లో 2.4%, క్యూ4లో 3.6%, 2021 తొలి త్రైమాసికంలో 1.6 శాతం, రెండో త్రైమాసికంలో 0.5% మేర తగ్గాయి. దాదా పు అయిదు త్రైమాసికాల తర్వాత హౌసింగ్‌ రేట్లు 2021 క్యూ3లో 0.1%, క్యూ4లో 2.1% పెరిగాయి. 

అంతర్జాతీయంగా ప్రభుత్వాల విధానపరమైన చర్యల తోడ్పాటు తదితర అంశాలతో హౌసింగ్‌ ధరలు మెరుగుపడ్డాయి.

>
మరిన్ని వార్తలు