దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్‌ సేల్స్‌

3 Jan, 2022 12:52 IST|Sakshi

సామాన్యుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనే కోరిక రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రముఖ ప్రాపర్టీ సంస్థ అనరాక్‌ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం గతేడాది మనదేశానికి చెందిన 7 ప్రధాన నగరాల్లో 71 శాతం ఇళ్ల అమ్మకాలు జరగ్గా..మొత్తం 2,36,530 యూనిట్ల ఇళ్ల సేల్స్‌ జరిగాయని తెలిపింది. 2019లో 2,61,358 యూనిట్లు, 2020లో 1,38,350 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు అనరాక్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది. 

పండగ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యింది


అనరాక్‌ డేటా ప్రకారం..ఫెస్టివల్‌ సీజన్‌, పలు బ్యాంకులు హోమ్‌లోన్లపై వడ్డీరేట్లు తగ్గిస్తూ భారీ ఆఫర్లు ప్రకటించాయి. అప్పటికే సొంతింటి కోసం దాచుకున్న డబ్బులు, బ్యాంకులు హోమ్‌లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించడంతో.. ఔత్సాహికులు  భారీ ఎత్తున ఇళ్లను కొనుగోలు చేశారు. దీంతో నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 2020 కంటే 2021లో 39శాతం ఇళ్లు భారీ ఎత్తున అమ్ముడయ్యాయి. 

అనరాక్ వార్షిక డేటా

అనరాక్ వార్షిక డేటా ప్రకారం..ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్‌)లో ఇళ్ల అమ్మకాలు 2021లో 72 శాతం పెరిగి 76,400 యూనిట్లకు చేరాయి,అంతకుముందు సంవత్సరంలో 44,320 యూనిట్లు ఉన్నాయి. 

హైదరాబాద్‌లో విక్రయాలు 2020లో 8,560 యూనిట్ల నుంచి దాదాపు  3రెట్లు పెరిగి 25,410 యూనిట్లకు చేరుకున్నాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అమ్మకాలు 2020లో 23,210 యూనిట్ల నుండి 2021లో 73శాతం పెరిగి 40,050 యూనిట్లకు చేరుకున్నాయి.

పుణేలో  ఇళ్ల అమ్మకాలు 2020లో 23,460 యూనిట్ల నుండి 2021లో 53శాతం పెరిగి 35,980 యూనిట్లకు పెరిగాయి. 

బెంగళూరులో  2020లో 24,910 యూనిట్ల నుండి 2021లో 33,080 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి.

చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 2020లో 6,740 యూనిట్ల నుంచి 2021లో 86శాతం పెరిగి 12,530 యూనిట్లకు చేరుకున్నాయి. 

కోల్‌కతాలో 2020లో 7,150 యూనిట్ల నుంచి 2021లో 13,080 యూనిట్లకు పెరిగాయి.

ఈ సందర్భంగా అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ..2022లో ఇళ్ల అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇన్‌పుట్ కాస్ట్ ప్రెజర్,సప్లై చైన్ సమస్యలు ప్రాపర్టీ ధరలు 5-8 శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి: హాట్ కేకుల్లా..! హైదరాబాద్‌లో ఎక్కువగా ఇళ్లు అమ్ముడవుతున్న ప్రాంతాలివే! 

మరిన్ని వార్తలు