ఐటీ డిమాండు నోటీసు వచ్చిందా..

31 May, 2021 13:58 IST|Sakshi

ప్రస్తుతం 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అసెస్‌మెంట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి డిమాండు నోటీసులైనా రావచ్చు.. రిఫండైనా రావచ్చు. మీరు వేసిన రిటర్నులోని అన్ని అంశాలతో డిపార్ట్‌మెంటు ఏకీభవించవచ్చు.. ఏకీభవించకపోవచ్చు. ఈ నేపథ్యంలో డిమాండు నోటీసు గురించి ఈ వారం తెలుసుకుందాం.

గత వారం చెప్పినట్లు మీరే స్వయంగా వారానికోసారి ఇన్‌కం ట్యాక్స్‌ వెబ్‌సైట్లోకి లాగిన్‌ అవ్వండి. E– Fileలోకి వెళ్లండి. ‘డిమాండ్‌’ అన్న కాలంని క్లిక్‌ చేయండి. తర్వాత ‘ View’ని క్లిక్‌ చేయండి. మీ అసెస్‌మెంట్‌ వివరాలు కనిపిస్తాయి. 

ఏయే సందర్భాల్లో రావచ్చు.. 

  • మీరు డిక్లేర్‌ చేసిన ఆదాయంతో డిపార్టుమెంటు ఏకీభవించకుండా, ఎక్కువ అసెస్‌ చేస్తే.. 
  • వ్యాపారస్తుల విషయంలో కొన్ని ఖర్చులను ఒప్పుకోకపోతే.. 
  • మీరు క్లెయిమ్‌ చేసిన ‘డిడక్షన్‌’ తప్పయితే.. 
  • మీకు అర్హత లేని లేదా వర్తించని డిడక్షన్లను క్లెయిమ్‌ చేస్తే 
  • తప్పులు దొర్లితే 
  • చెల్లించిన పన్ను వివరాలు.. టీడీఎస్, అడ్వాన్స్‌ ట్యాక్స్, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ మొదలైన వాటి విషయంలో అప్‌డేట్‌ అయిన వివరాలతో సరిపోలకపోతే 
  • రిటర్నుల్లో వివరాలు సరిగ్గా, సమగ్రంగా పొందుపర్చకపోతే 
  • ఆదాయం,పన్ను చెల్లింపులు, చెల్లించవలసిన మొత్తం వంటి వివరాల్లో హెచ్చుతగ్గులు ఉంటే నోటీసు రాగానే ఏం చేయాలి.. 
  • గాభరాపడనక్కర్లేదు. ఆ నోటీసులో ప్రతీ అంశాన్ని చదవండి. 
  • వాళ్లే ఒక కాలంలో మీరు డిక్లేర్‌ చేసింది, ఆ పక్కన ఇంకో కాలంలో వారు అసెస్‌ చేసినది చూపిస్తారు. 
  • ఈ రెండింటినీ సరిపోల్చి చూసుకోండి. 
  • వారి డిమాండ్‌ కరెక్ట్‌ అయితే ఆ విషయం ఒప్పుకుని డిమాండు మొత్తాన్ని చెల్లించండి. 
  • ఒకవేళ వారితో ఏకీభవించకపోతే ఒప్పుకోకండి. ‘disagree’ అని క్లిక్‌ చేయండి. సరయిన వివరణ, జరిగిన తప్పులను సరిదిద్దడం, పూర్తి వివరాలను పొందుపర్చటం వంటివి చేయండి. 
  • ఒక్కొక్కప్పుడు కొంత తప్పే మీది కావచ్చు..ఇంకొంత తప్పు వారిది కావచ్చు. డిమాండు కొంతవరకే నిజం కావచ్చు. అంటే పాక్షికంగా అన్నమాట. అలాగే బదులివ్వండి. పూర్తి వివరాలతో సరైన వివరణ ఇవ్వండి. 
  • కాగితాలు, రుజువులు, ఆధారాలు అడిగితే జతపర్చండి. 
  • ఇలా చేస్తే మీ ఆదాయపు పన్నుఅసెస్‌మెంటు పూర్తయినట్లే. నోటీసుకి బదులివ్వడం వలన మీ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా మీ అసెస్‌మెంటు అంశానికి సంబంధించిన కథకు కూడా సుఖాంతం పలికినట్లవుతుంది.

ట్యాక్సేషన్‌ నిపుణులు
కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య 

మరిన్ని వార్తలు