HUL: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు!

17 Feb, 2022 16:39 IST|Sakshi

ముంబై: దేశంలోని అతి పెద్ద ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సుమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. గత నెలలో సబ్బులు & డిటర్జెంట్ల ధరలను పెంచిన కంపెనీ ఫిబ్రవరిలో మళ్లీ ధరలను పెంచినట్లు ఒక సంస్థ నివేదిక పేర్కొంది. మార్కెట్ ఎనలిస్ట్ సంస్థ ఎడెల్వీస్ ప్రకారం.. ఈ నెలలో సబ్బులు, డిటర్జెంట్లు & డిష్ వాష్ ఉత్పత్తుల ధరలను 3 నుండి 10 శాతం వరకు పెంచింది. "సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్, సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్, విమ్ బార్ & లిక్విడ్, లక్స్ & రెక్సోనా సబ్బులు, పాండ్స్ టాల్కమ్ పౌడర్, ఇతరులతో సహా అనేక ఉత్పత్తుల ధరలను పెంచినట్లు మా కంపెనీ తనిఖీలలో తేలింది" అని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్నీష్ రాయ్ చెప్పారు. 

దేశంలోని అతి పెద్ద కన్సుమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎంసీజీ) హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ అక్టోబర్ నుంచి దాదాపు ప్రతి నెలా ఈ ఉత్పత్తుల ధరలను పెంచుతూ వస్తుంది. నవంబర్ నెలలో వీల్ డిటర్జెంట్ 1 కి.గ్రా ప్యాక్ ధరను 3.4 శాతం పెంచితే, డిసెంబర్ నెలలో లైఫ్ బోయి సబ్బులు, మీడ్-సెగ్మెంట్ లక్స్, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ కేక్, రిన్ డిటర్జెంట్ బార్ ధరలను 7 నుంచి 13 శాతం వరకు పెంచింది. గత నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది. ఎడెల్వీస్ అంచనాల ప్రకారం.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌యుఎల్ వివిద కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను సంవత్సరానికి 8 శాతం పెంచింది. ఈ ధరలు పెరగడటానికి ప్రధాన కారణం ముడిసరుకుల ధరల పెరగడమే అని కంపెనీ చెబుతూ వస్తుంది. 

(చదవండి: ఉబర్ రైడ్ చేసే కస్టమర్లకు గుడ్ న్యూస్..!)

మరిన్ని వార్తలు