హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ జి. వంశీ గడ్డం ప్రారంభించిన ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్ ఆటమ్ మొబైల్ మార్కెట్లోకి ఆటమ్ 1.0 న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేసింది. పోర్టబుల్ లిథియం అయాన్ బ్యాటరీ, రెండేళ్ల వారంటీ ఉంటుంది. ఇది 6 కిలోల తేలికపాటి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. 4 గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. చార్జింగ్కు కేవలం ఒక యూనిట్ మాత్రమే తీసుకుకుంటుంది. (నోకియా 5.3 విక్రయాలు ప్రారంభం)
ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ఫౌండర్ జి. వంశీ గడ్డం తెలిపారు. బైక్ ప్రారంభ ధర రూ.50 వేలు. పటాన్చెరులో తయారీ కేంద్రం ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,500 బైక్స్. డిమాండ్ను బట్టి అదనంగా 1000 బైక్లను ఉత్పత్తి చేస్తామని వంశీ తెలిపారు. సాంప్రదాయ ఐసీఈ బైక్లతో పోలిస్తే ఆటమ్ 1.0 రోజువారీ ఖర్చు చాలా తక్కువని, దీంతో వినియోగదారులకు ఎంతో లాభం కలుగుతుందన్నారు. 3 సంవత్సరాల పాటు కృషి చేసి ఈ బైక్ను తయారుచేశామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతు పాత్ర పోషించేందుకు ఆటమ్ 1.0 ఆవిష్కరించామన్నారు.