ఐటీ సెక్టార్‌లో అతివల నాయకత్వం ఎక్కడ?

6 Oct, 2021 10:56 IST|Sakshi

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌ నగరం దూసుకుపోతుంది. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలు తెరిచేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ బాట పట్టాయి. ఇంతలా అభివృద్ధి జరుగుతూ కాస్మోపాలిటన్‌ సిటీగా ఎదిగినా.. ఐటీలో అతివల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. 

ఐటీలో అవకాశాలు
హైదరాబాద్‌లో ఐటీ సెక్టార్‌ దూసుకుపోతుంది. గడిచిన ఏడేళ్లలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షల నుంచి 6.22 లక్షలకు పెరిగింది. భారీ స్థాయిలో ఐటీ రంగంలో ఉద్యోగాలు నగరంలో లభిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన గ్రాడ్యుయేట్లను హైదరాబాద్‌ నగరం అక్కున చేర్చకుంటుంది. ఇందులో లేడీ ఎప్లాంయిస్‌ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇలా ఐటీ సెక్టార్‌లో ఎంప్లాయిస్‌గా చేరుతున్న వారిలో టాప్‌ పొజిషన్‌కి చేరుతున్న అతివల సంఖ్య మేల్‌ ఎంప్లాయిస్‌తో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటోంది.

 

టాప్‌లో లేరు
హైదరాబాద్‌ స్టాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హెచ్‌వైఎస్‌ఈఏ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐటీ సెక్టార్‌లో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉద్యోగులందరి డేటాను పరిశీలిస్తే మహిళలు 40 నుంచి 45 శాతం వరకు ఉన్నట్టు తేలింది. ఈ గణంకాలు చూడటానికి బాగానే ఉన్నా.. టాప్‌ పొజిషన్‌కి వెళ్లేకొద్ది ఈ సంఖ్య సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యిందంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రచురించింది.

రాబోయే ఐదేళ్లలో
హెచ్‌వైఎస్‌ఈఏ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ నగరంలో ఐటీ ప్రొఫెషనల్స్‌లో మొత్తంగా చూస్తే మహిళలు 34 శాతం వరకు ఉన్నారు. కానీ ఇందులో ఎగ్జిక్యూటివ్‌ లెవల్‌, టీమ్‌ లీడర్‌ తదితర  లీడింగ్‌ పొజిషన్లలో పని చేస్తున్నవారి శాతం 4 నుంచి 5 శాతానికే పరిమితం అయ్యింది. రాబోయే ఐదేళ్లలో లీడింగ్‌ పొషిజన్‌లోకి కనీసం 20 శాతం మహిళలు చేరుకునేలా ఐటీ సెక్టార్లో మార్పులు తీసుకురాబోతున్నట్టు హెచ్‌వైఎస్‌ఈఏ అధ్యక్షుడు భరణి వెల్లడించారు.

పరిమితులే కారణం
ఐటీ సెక్టార్‌లో ఉన్నత స్థానాల్లోకి చేరుకోవాలంటే శ్రమించడంతో పాటు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళలకు ఆఫీస్‌కు కేటాయించే సమయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు ఇంట్లో పనులతో పాటు పిల్లల పెంపకం తదితర అంశాలకు టైం కేటాయించాల్సి ఉంటుంది. అందువల్లే ప్రస్తుతం టాప్‌ పొజిషన్‌కి చేరకుంటున్న స్త్రీల సంఖ్య తక్కువగా ఉందని వెస్ట్రన్‌ డిజిటల్‌ కార్పోరేషన్‌ హెచ్‌ఆర్‌ కిరణ్మయి అంటున్నారు. ఈ తరహా పరిస్థితి ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదని దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు.

మొదలైన చర్యలు
ఐటీ సెక్టార్‌లో మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. ఈ సెక్టార్‌లో కొత్తగా ఉద్యోగాలు పొందుతున్న వారిలో మహిళల వాటా 2015లో 11.4 శాతం ఉండగా 2021లో 17.3 శాతానికి చేరుకుంది. దీనికి తగ్గట్టే టాప్‌ పొజిషన్‌లో మహిళలకు ప్రాధాన్యత దక్కేలా ప్రత్యేక కార్యక్రమాలు అనేక కంపెనీలు నిర్వహిస్తున్నాయి. 

చదవండి: సేవల రంగంలో పెరిగిన ఉపాధి కల్పన

మరిన్ని వార్తలు