బాబోయ్‌, హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. కారణం ఎంటంటే!

17 Nov, 2022 07:15 IST|Sakshi

ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 14 శాతం అప్‌ 

సెప్టెంబర్‌ క్వార్టర్‌పై క్రెడాయ్‌–కొలియర్స్‌ నివేదిక 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్‌ త్రైమాసికంలో 8 శాతం పెరిగాయి. చరదపు అడుగు ధర రూ.9,266కు చేరుకుంది. దేశంలో అత్యధికంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ మార్కెట్లో ఇళ్ల ధరలు 14 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.7,741గా ఉంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల రియల్టీ ధరల వివరాలతో క్రెడాయ్‌–కొలియర్స్, లియాసెస్‌ ఫొరాస్‌ నివేదిక విడుదలైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగాయి.

► ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో అత్యధికంగా గోల్ఫ్‌కోర్స్‌ రోడ్డులో ఇళ్ల ధరలు 21 శాతం పెరిగాయి. 
► కోల్‌కతాలో సగటున 12 శాతం అధికమై, చదరపు అడుగు ధర రూ.6,954గా ఉంది.  
► అహ్మదాబాద్‌ పట్టణంలో 11 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.6,077గా ఉంది.
 
► పుణెలో 9 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.8,013కు చేరింది.  
► బెంగళూరులో 6% పెరిగి రూ.8,035గా ఉంది.  
► చెన్నై, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో ధరల్లో పెద్ద మార్పు లేదు. చెన్నైలో చదరపు అడుగు రూ.7,222గా, ఎంఎంఆర్‌లో రూ.19,485 చొప్పున ఉంది.  
► 2022 ఆరంభం నుంచి డిమాండ్‌ బలంగా ఉండడం, నిర్మాణ వ్యయాలు అధికం కావడంతో ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చినట్టు ఈ నివేదిక తెలిపింది.  

‘కే’ షేప్డ్‌ రికవరీ
‘‘దేశవ్యాప్తంగా రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌ ధరల పరంగా ‘కే’ ఆకారపు రికవరీ తీసుకుంది. వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్‌ బలంగా కొనసాగింది. అద్దె ఇంటి కంటే సొంతిల్లు అవసరమనే ప్రాధాన్యత కరోనా తర్వాత ఏర్పడింది’’అని క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ హర్ష వర్ధన్‌ పటోడియా చెప్పారు.

డిమాండ్‌ ఉన్నందున అమ్ముడుపోని మిగులు ఇళ్ల నిల్వలు ఇక ముందు తగ్గుతాయని అంచనా వేశారు. ఇళ్ల ధరల పెరుగుదల అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణ ధోరణలకు అనుగుణంగానే ఉందన్నారు. డిమాండ్‌ బలంగా ఉండడంతో ఇళ్ల ధరల పెరుగుదల ఇంక ముందూ కొనసాగొచ్చని అంచనా వేశారు.

చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు!

మరిన్ని వార్తలు