ఈ విషయంలో ముంబై, ఢిల్లీలను వెనక్కి నెట్టిన హైదరాబాద్‌

30 Sep, 2021 15:53 IST|Sakshi

కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో హైదరాబాద్‌లో రియాల్టీ రంగం మళ్లీ పుంపుకుంటోంది. ముంబై, బెంగళూరులను దాటి మరీ వృద్ధి కనబరుస్తోంది. ఇటీవల భాగ్యనగరంలో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ఇళ్ల అమ్మకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

హైదరాబాద్‌ బెటర్‌
కోవిడ్‌ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఆర్థిక రంగం కుంటుపడింది. ఆదాయాలు పడిపోవడంతో ప్రజలు భారీ ఖర్చులు చేసేందుకు వెనుకాడుతున్నారు. దీంతో కొత్తగా ప్లాటు బుక్‌ చేయాలన్నా, ఇళ్లు కొనాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌లో ప్రాపర్టీ బిజినెస్‌ సానుకూలంగానే ముందుకు సాగుతోంది. 

ముంబైని వెనక్కి నెట్టి
మార్చిలో మొదలైన కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఇంచుమించు జూన్‌ చివరి వరకు కొనసాగింది. ఆ తర్వాతే ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడ్డాయి. అప్పటి నుంచి జులై, ఆగష్టు, సెప్టెంబరులకు సంబంధించి మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో రియాల్టీ భారీగా పుంజుకుంది. రియాల్టీ వృద్ధి రేటులో ముంబై వంటి మహానగరాన్ని సైతం వెనక్కి నెట్టింది. అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తాజా సర్వేలు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

308 శాతం వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌ నగర పరిధిలో 6,735 ఇళ్లు అమ్ముడయ్యాయి. అంతుకు ముందే ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన ఇళ్ల సంఖ్య కేవలం 1,650 ఇళ్లు మాత్రమే. ఏడాది వ్యవధిలోనే ఏకంగా 308 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇదే సమయంలో ముంబైలో ఇళ్ల అమ్మకాలు 9,200ల నుంచి 20,965కి చేరుకున్నాయి. ఇంటే ఇక్కడ వృద్ధి రేటు 128 శాతంగా నమోదు అయ్యింది.

మిగిలిన చోట
ఇళ్ల అమ్మకాలకు సంబంధించి హైదరాబాద్‌, ముంబైల తర్వాత స్థానంలో చెన్నై 113 శాతం, పూనే 100 శాతం వృద్ధిని సాధించాయి. ఈ నాలుగు నగరాలు వంద శాతం వృద్ధిరేటుతో ఉండగా కోల్‌కతా కొంచెం వెనుకబడి 99 శాతం , నేషనల్‌ ‍ క్యాపిటల్‌ రీజియన్‌ (ఢిల్లీ) 97 శాతం వృద్ధిని కనబరిచాయి. మెట్రోపాలిటన్‌ సిటీస్‌లోనే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పేరుపడిన బెంగళూరులో అమ్మకాలు కేవలం 58 శాతమే పెరిగాయి.

ఆల్‌ హ్యాపీ
దేశంలో ఏ మెట్రో నగరాల్లో లేనంత వృద్ధి హైదరాబాద్‌లో చోటు చేసుకుంటోంది. ఇన్వెస్టర్లు, హోం బయ్యర్లు, డెవలపర్స్‌ అందరూ ఇక్కడి వ్యాపారం పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారని ఆనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనుజ్‌ పూరి అన్నారు. ఇక్కడ సోషియో ఎకనామిక్‌ కండీషన్స్‌ బాగుండటం, మౌలిక వసతులకు ఇబ్బంది లేకపోవడం అన్నింటికి మించి అందుబాటు ధరలో ఇళ్లు లభిస్తుండంతో రియాల్టీలో మిగిలిన నగరాలను హైదరాబాద్‌ వెనక్కి నెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.

వీటికే డిమాండ్‌
హైదరాబాద్‌లో ఎక్కువ రూ. 40 లక్షల నుంచి రూ. 1.50 మధ్యన ధర ఉన్న ఇళ్లు ఎక్కువగా అమ్ముడైపోతున్నట్టు సర్వేలో తేలింది. ఇంటి బడ్జెట్‌ లెక్కలు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం నగరంలో రూ. 80 లక్షల నుంచి ఒక కోటి రూపాయల వ్యయంలో లగ్జరీ ఇళ్లు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారను.

ఐటీదే మేజర్‌ షేర్‌
రియాల్టీ రంగంలో తిరిగి బూమ్‌ నెలకొనడంలో ఐటీ ఎంప్లాయిస్దే మేజర్‌ షేర్‌, మిగిలిన నగరాల్లో పోల్చితే ఇక్కడ నియమకాలు బాగుండటం, జాబ్‌ సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉండటంతో ఇళ్లు కొనేందుకు ఐటీ ప్రొఫెషనల్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తక్కువ ధరకే మంచి ఇళ్లులు ఇక్కడ లభించడంతో ఇతర నగరాల్లో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స​ సైతం హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  

చదవండి : Homebuyer Preference Survey 2021: 'అద్దె ఇంట్లో ఉండలేం.. 3 నెలల్లో సొంతిల్లే కొనుక్కుంటాం'

మరిన్ని వార్తలు