Hotel Occupancy: హైదరాబాద్‌ తర్వాతే ముంబై, బెంగళూరు నగరాలు

11 Nov, 2021 13:44 IST|Sakshi

Hotel Occupancy: కోవిడ్‌ సంక్షోభం తర్వాత హైదరాబాద్‌ నగరం వేగంగా కోలుకుంటోంది. ఇప్పటికే ఆఫీస్‌ స్పేస్‌, రియల్టీ రంగాల్లో కోవిడ్‌ పూర్వ స్థితికి చేరుకుంటుండగా తాజాగా ఆతిధ్య రంగానికి సంబంధించి దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది.
నంబర్‌ వన్‌ హైదరాబాద్‌
ఆతిధ్య రంగానికి సంబంధించి మూడో త్రైమాసికం (జులై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌)లో యావరేజ్‌ అక్యుపెన్షీ రేషియో (ఏఓఆర్‌) విషయంలో హైదరాబాద్‌ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని జేఎల్‌ఎల్‌ రీసెర్చ్‌ తెలిపింది. దేశంలో ఉన్న ఆరు ప్రధాన నగరాల నుంచి డేటాను సేకరించి ఆ సంస్థ విశ్లేషించింది. హోటళ్లలో ఆక్యుపెన్షి లెవల్‌ రిజిస్ట్రరింగ్‌ విభాగంలో​ హైదరాబాద్‌ నగరం 33.60 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ తర్వాత గోవా (29.8 శాతం), ముంబై (29.4 శాతం), బెంగళూరు (26.8శాతం), ఢిల్లీ (25.5 శాతం), చెన్నై (24.1 శాతం) వృద్ధిని నమోదు చేశాయి.
రెవెన్యూలో గోవా
హస్పిటాలిటీ సెక్టార్‌కి సంబంధించి గతేడాదితో పోల్చితే రెవెన్యూ పర్‌ అవైలబుల్‌ రూమ్‌ విభాగంలో మూడో త్రైమానికంలో మరోసారి గోవా ప్రథమ స్థానంలో నిలిచింది. రెవెన్యూ గ్రోత్‌ విషయంలో గోవాలో 389 శాతం వృద్ధి ఉండగా బెంగళూరు 213 శాతం హైదరాబాద్‌ 173 శాతం వృద్ధిని కనబరిచాయి.
కోలుకుంటోంది
కరోనా సంక్షోభం తీవ్రంగా నెలకొన్న 2020తో పోల్చితే 2021లో ఆతిధ్య రంగం పుంజుకుంటోందని జేఎల్‌ఎల్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా మూడో త్రైమాసికంలో ఆతిధ్య రంగంలో 169 శాతం వృద్ధి నమోదైందన్నారు. రెండో త్రైమాసికంలో ఈ వృద్ధి 123 శాతంగా ఉంది. క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పడానికి ఈ గణాంకాలు ఉదహరణలుగా నిలుస్తున్నాయి.

చదవండి:గార్డెన్‌ సిటీ కిందికి నిజాం నగరం పైకి

మరిన్ని వార్తలు