భారత ఆటోమొబైల్‌ రంగంలో సంచలనం..! హైడ్రోజన్‌ కారును లాంచ్‌ చేసిన టయోటా..!

16 Mar, 2022 16:23 IST|Sakshi

గ్రీన్‌ మొబిలిటే లక్ష్యంగా..సంప్రదాయ దహనశీల వాహనాలకు చెక్‌ పెడుతూ..ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేసే పనిలో పడ్డాయి పలు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు. మరికొన్ని కంపెనీలు ఈవీ వాహనాలపైనే కాకుండా హైడ్రోజన్‌ ఫ్యుయల్‌ సెల్స్‌తో నడిచే వాహనాలను కూడా తయారు చేసేందుకు సిద్దమయ్యాయి. ఈ వాహనాల తయారీలో జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా ఒక అడుగు ముందుంది. కొద్దిరోజుల క్రితమే హ్రైడోజన్‌ ఫ్యుయల్‌తో నడిచే కారును టయోటా మిరాయ్‌ను ఆవిష్కరించింది. కాగా తాజాగా హైడ్రోజన్‌తో నడిచే కారును టయోటా భారత్‌లోకి తీసుకొచ్చింది. 

భారత్‌లోని తొలి కారుగా రికార్డు..!
భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్‌ ఆధారిత ఫ్యుయెల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ను టయోటా మిరాయ్‌ కారును కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లాంచ్‌ చేశారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే టయోటా మిరాయ్ సెడాన్‌ కారును టయోటా ఆవిష్కరించింది. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ను టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టయోటా మిరాయ్ ఎస్‌యూవీ సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. దీనిలో హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తారు. హైడ్రోజన్‌ వాయువును విచ్చిన్నం చేయడంతో విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఇక ఈ కారు నుంచి నీరు అవశేషంగా బయటకు వస్తోంది. సాధారణంగా సంప్రదాయ ఇంధన వాహనాలు కర్భన ఉద్గారాలను రిలీజ్‌ చేస్తాయి.

ఇంధన ధరలకు చెక్‌..!
సమీప భవిష్యత్తులో టయోటాకు చెందిన క్యామ్రీ కారులో ఫ్లెక్స్ ఇంధనాన్ని ఉపయోగించబోతున్నట్లు నితిన్‌ గడ్కరీ తెలిపారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ వాహనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యమని గడ్కరీ అన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, ఫ్లెక్స్‌ ఇంధనంతో పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్‌ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. 

చదవండి: భారీ షాక్‌..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్‌ ధరలకు రెక్కలే..!

మరిన్ని వార్తలు