కీలక నిర్ణయం..వారికి అదిరిపోయే శుభవార్తను అందించిన ఐసీఐసీఐ బ్యాంక్‌..!

10 Apr, 2022 16:54 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ శుభవార్తను అందించింది. సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగిస్తూ ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ప్రత్యేకమైన వడ్డీరేట్లను సీనియర్‌ సిటిజన్లకు అందించనుంది. 

సీనియర్‌ సిటిజన్ల కోసం ఐసీఐసీఐ బ్యాంకు పలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వారి కోసం ప్రత్యేకమైన వడ్డీ రేట్లతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ను ప్రకటించింది.  ఈ స్కీమ్‌లో భాగంగా సీనియర్‌ సిటిజన్లకు అందించే 0. 50 శాతం వడ్డీరేటుతో పాటు మరో 0.25 శాతం అదనపు వడ్డీ రేటును సీనియర్‌ సిటిజన్లకు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ స్కీమ్ జనవరి 20నే ముగియాల్సి ఉండగా దానిని ఏప్రిల్ 8 వరకు ఐసీఐసీఐ బ్యాంక్‌ పొడిగించింది. ఇప్పుడు తాజాగా  మరోసారి ఎఫ్‌డీ స్కీమ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. దీంతో ఈ స్కీమ్‌ సినీయర్‌ సిటిజన్లకు మరో 5 నెలల పాటు అందుబాటులో ఉండనుంది.  ఈ కొత్త వడ్డీ రేట్లు కొత్తగా ఓపెన్ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు వర్తించనుంది. దాంతో పాటుగా పాత ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకున్నవారికి కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఈ ప్రత్యేక పథకం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 6.35 శాత వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ ఖాతాదారులకు అందించే 5.60 శాతం కంటే ఎక్కువ.

చదవండి: గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..! వారు రూ. 5 వేలకు మించి విత్‌ డ్రా చేయలేరు..!

మరిన్ని వార్తలు