ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లాభం ఓకే

21 Apr, 2022 01:32 IST|Sakshi

క్యూ4లో రూ. 340 కోట్లు

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 340 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 329 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం జంప్‌చేసి రూ. 892 కోట్లకు చేరింది. క్లయింట్‌ బేస్‌ 6.2 లక్షలు పెరిగి 76 లక్షలకు చేరింది.

   వాటాదారులకు షేరుకి రూ. 12.75 చొప్పున తుది డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పూర్తి ఏడాదికి రికార్డు సృష్టిస్తూ రూ. 24 డివిడెండును అందించినట్లు తెలియజేసింది. క్యూ4లో ఆల్‌రౌండ్‌ పనితీరు చూపినందుకు సంతోషిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో విజయ్‌ చందోక్‌ పేర్కొన్నారు. అన్ని బిజినెస్‌ విభాగాల్లోనూ వృద్ధి సాధించామని, ఇది మా సామర్థ్యాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 29 శాతం ఎగసి రూ. 1,383 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 33 శాతం జంప్‌చేసి రూ. 3,438 కోట్లయ్యింది.

మరిన్ని వార్తలు