2022-23లో పెరగనున్న ఎన్‌బీఎఫ్‌సీ ఆస్తులు

15 Mar, 2022 21:11 IST|Sakshi

2022-23లో 10 శాతం వృద్ధికి అవకాశం 

2021-22లో 5-7 శాతం 

ఇక్రా రేటింగ్స్‌ నివేదిక  

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీలు) నిర్వహణలోని ఆస్తులు(రుణాలు/ఏయూఎం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2022–23)లో 8-10 శాతం వరకు పెరుగుతాయని ఇక్రా రేటింగ్స్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఆస్తుల వృద్ధి 5-7 శాతంగా ఉండొచ్చని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (గృహ రుణాలు ఇచ్చే సంస్థలు/హెచ్‌ఎఫ్‌సీలు) ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. 

ఎన్‌బీఎఫ్‌సీలలో రిటైల్‌ విభాగం, వ్యక్తిగత రుణాలు, మైక్రోఫైనాన్స్, బంగారం రుణాలు ప్రధానంగా వృద్ధికి దోహదపడతాయని వివరించింది. వాహన రుణాలు, వ్యాపార రుణాలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. ఈ విభాగాల్లో ఆస్తుల నాణ్యత అంశాలు ఇంకా సమసిపోలేదని గుర్తు చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ హోల్‌సేల్‌ రుణాల ఏయూఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్షీణిస్తుందని అంచనా వేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికంలో రుణాల పంపిణీ అంచనాలను సవరించామని.. కరోనా మూడో విడత ప్రభావం తక్కువగానే ఉండడంతో నాలుగో త్రైమాసికంలో (2022 జనవరి-మార్చి) సవరించొచ్చని పేర్కొంది. రుణాల మంజూరులో వృద్ధి ఆరోగ్యకరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వృద్ధి కోసం రూ.1.8-2.2 లక్షల కోట్ల తాజా నిధులు అవసరమవుతాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. 

(చదవండి: దేశంలో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టే ఆలోచన లేదు: కేంద్రం)

మరిన్ని వార్తలు