‘హురూన్‌’ సంపన్నుల్లో మనోళ్లు 69 మంది

7 Oct, 2021 02:05 IST|Sakshi

ఫార్మా నుంచే అత్యధికం

కొత్తగా 13 మందికి చోటు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా సంపన్నుల జాబితా–2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు.

వీరిలో హైదరాబాద్‌ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెపె్టంబర్‌ 15 నాటికి బిలియన్‌ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్‌ ల్యా»ొరేటరీస్‌ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు.

ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్‌రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్‌ రెడ్డి (బాలాజీ అమైన్స్‌), దాసరి ఉదయ్‌కుమార్‌ రెడ్డి (తాన్లా ప్లాట్‌ఫామ్స్‌), అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి (గ్రీన్‌కో), మహేశ్‌ కొల్లి(గ్రీన్‌కో) ఉన్నారు.

మరిన్ని వార్తలు