రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్‌ సరికొత్త ఆవిష్కరణ!

3 Sep, 2021 11:36 IST|Sakshi

హైదరాబాద్‌ : వ్యవసాయదారులకు, రైతుకూలీలకు ఉపయోకరంగా ఉండటమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ బాటలు వేసింది. 

వేస్ట్‌ టూ వెల్త్‌
వ్యవసాయం చేసేప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలతో బయో బ్రిక్స్‌ (ఇటుకలు)ను ఐఐటీ, హైదరాబాద్‌ విద్యార్థులు రూపొందించారు. సాగు చేసేప్పుడు వచ్చే చెత్తను సేకరించి దాన్ని ప్రత్యేక పద్దతిలో మిక్స్‌ చేసి ఈ ఇటుకలను రూపొందించారు. ప్రస్తుతం ప్రోటోటైప్‌లో ఉన్న ఈ ఇటుకలను కమర్షియల్‌ పద్దతిలో భారీ ఎత్తున తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందివ్వడంతో పాటు ఆఫ్‌ సీజన్‌లో రైతు కూలీలకు కూడా మరో పనిని అందుబాటులోకి తెచ్చినట్టు అవుతుందని ఐఐటీ , హైదరాబాద్‌ అధ్యాపకులు అంటున్నారు.

ప్రాజెక్ట్‌ బిల్డ్‌ 
ఐఐటీ హైదరాబాద్‌లో బోల్డ్‌ యూనిక్‌ ఐడియా లీడ్‌ డెవలప్‌మెంట్‌ (బిల్డ్‌) పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టులో భాగంగా 2019 నుంచి బయె బ్రిక్‌ పరిశోధనలు ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్‌ క్యాంపస్‌లోనే ఈ ఇటుకలను ఉపయోగించి సెక్యూరిటీ గార్డ్‌ గదిని నిర్మించారు.

బయె ఇటుక ప్రత్యేకతలు 
- సాధారణ ఇటుకలతో పోల్చినప్పుడు బయో ఇటుకలు చాలా తక్కువ (ఎనిమిదో వంతు) బరువును కలిగి ఉన్నాయి. దీంతో ఇంటి పైకప్పు నిర్మాణానికి సైతం వీటిని వినియోగించవచ్చు. పీవీసీ షీట్‌లపై ఈ ఇటుకలను పేచ్చి కప్పును పూర్తి చేయవచ్చు.

- బయె ఇటుకలు వాటర్‌ ప్రూఫ్‌, ఫైర్‌ ప్రూఫ్‌గా పని చేస్తాయి. కాబట్టి భవనానికి అదనపు రక్షణ లభిస్తుంది. అంతేకాదు కొంత మేరకు సౌండ్‌ ప్రూఫ్‌గా కూడా పని చేస్తున్నాయి. 
- సాధారణ ఇటుకలతో పోల్చితే బయో ఇటుకలను కాల్చేందుకు కనీసం 6 సెంటిగ్రేడ్‌ వరకు తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం తగ్గిపోతుంది.
- ఈ ఇటుకలను భారీ ఎత్తున తయారు చేస్తే ఒక్కో ఇటుక తయారీకి కేవలం రూ.2 నుంచి రూ. 3 ల వ్యయం అవుతుంది. దీంతో ఇటుకల రేటు తగ్గిపోతుంది.

గ్రామీణ ప్రాంతాలకు ఉపయుక్తం
బయో బ్రిక్‌ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తే రూరల్‌ ఇండియాకు ఎంతగానో మేలు జరుగుతుందని ఐఐటీ హైదరాబాద్‌ అధ్యాపక బృందం అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే వ్యర్థాలతో అతి తక్కువ ఖర్చుతోనే ఇటుకలు అందుబాటులోకి వస్తాయని, వీటి వల్ల ఇంటి నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందంటున్నారు. వ్యయం తగ్గడంతో పాటు ఇంటి నాణ్యత కూడా బాగుంటుందని హామీ ఇస్తున్నారు. 
చదవండి : Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్‌ మెట్రో! ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం?

మరిన్ని వార్తలు