ఎయిరిండియా సీఈవో పోస్టుకు ఇల్కర్‌ తిరస్కరణ 

2 Mar, 2022 03:46 IST|Sakshi

అవాంఛనీయ కథనాలు ప్రచారం చేశాయని భారత మీడియాపై వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిరిండియా సీఈవో, ఎండీగా చేరాలంటూ టాటా గ్రూప్‌ ఇచ్చిన ఆఫర్‌ను ఇల్కర్‌ అయిజు తిరస్కరించారు. భారత మీడియాలోని కొన్ని వర్గాలు .. అవాంఛనీయ కథనాలతో తన నియామకంపై సందేహాలు రేకెత్తించేందుకు ప్రయత్నించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను తాజా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘ఒక వ్యాపార నాయకుడిగా నేను ఎప్పుడూ ఉన్నత విలువలకు ప్రాధాన్యం ఇస్తాను.

నా నియామకాన్ని ప్రకటించినప్పటి నుంచి దానికి అవాంఛనీయ రంగులు అద్దేలా భారత మీడియాలోని కొన్ని వర్గాలు అభ్యంతరకమైన కథనాలను ప్రచారం చేస్తుండటాన్ని పరిశీలించాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆ బాధ్యతలు చేపట్టడం సరికాదనే నిర్ణయానికి వచ్చాను‘ అని ఇల్కర్‌ తెలిపారు. ఎయిరిండియాకు సారథ్యం వహించే అవకాశాన్ని ఆఫర్‌ చేసినందుకు టాటా గ్రూప్, దాని చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిరిండియాను టాటా సన్స్‌ గతేడాది అక్టోబర్‌లో రూ. 18,000 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికి సీఈవో, ఎండీగా టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ చైర్మన్‌ ఇల్కర్‌ను నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 14న ప్రకటించింది. 

మరిన్ని వార్తలు