Tiktok: భారత్‌లో లైన్‌ క్లియర్‌?.. పేరు మార్పు!

6 Jul, 2021 13:15 IST|Sakshi

వీడియో కంటెంట్‌ యాప్‌ టిక్‌టాక్‌ మళ్లీ మనదేశంలో అడుగుపెట్టబోతోందా? టిక్‌టాక్‌ మాతృక సంస్థ బైట్‌డ్యాన్స్‌ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అవుననే సంకేతాలు అందుతున్నాయి. అయితే వేరే పేరుతో.. వేరే కంపెనీ నిర్వహణలో ఇది మన దగ్గరకు మళ్లీ చేరనున్నట్లు సమాచారం.  

టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ ఊహించని నిర్ణయం తీసుకుంది. యాప్‌కు సంబంధించిన ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీతో పాటు అల్గారిథంను కూడా అమ్మేందుకు సిద్ధపడింది. అమ్మకపు ఆఫర్‌ ప్రకటించిన దేశాల్లో భారత్‌ పేరును సైతం చేర్చింది. ఆసక్తి ఉన్న కంపెనీలు తమ టెక్నాలజీని కొనుగొలు చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ మేరకు బైట్‌ఫ్లస్‌ డివిజన్‌ అమ్మకం వ్యవహారాలను చూసుకుంటుందని పేర్కొంది. 

కొనేది ఎవరు?
టిక్‌టాక్‌ సక్సెస్‌లో అల్గారిథమ్‌ కీ రోల్‌ పోషించింది. అలాంటి దానిని అమ్మకానికి బైట్‌డ్యాన్స్‌ ఉంచడం విశేషం.  అమెరికా నుంచి ఫ్యాషన్‌ యాప్‌ గోట్‌, సింగపూర్‌కు చెందిన ట్రావెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌ వీగో, ఇండొనేషియాకు చెందిన ఆన్‌లైన్‌ స్టార్టప్‌ కంపెనీ చిలిబెలీ కంపెనీలు బైట్‌డ్యాన్స్‌ ప్రత్యేక విభాగంతో కొనుగోలు ఒప్పందాన్ని చేసేసుకున్నాయి.ఇక భారత్‌ నుంచి వీడియో కంటెంట్‌తో అలరిస్తున్న ఓ యాప్‌ తో పాటు షార్ట్‌ న్యూస్‌లు అందించే ఒక యాప్‌ కంపెనీ, ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌, ఓ ఫుడ్‌ అవుట్‌లెట్‌, ఆన్‌లైన్‌లో సరుకులు రవాణా చేసే ఓ యాప్‌.. ఇలా పన్నెండు కంపెనీలు పోటీపడుతున్నట్లు సమాచారం.

అయితే బైట్‌డ్యాన్స్‌ చైనాకు చెందిన కంపెనీ కావడంతో భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో యాప్‌ తీరుతెన్నులపై, భద్రతపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం.. మరో రూపంలో దానిని అనుమతి ఇస్తుందా?. తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. ఒకవేళ అనుమతి దొరికితే మాత్రం.. ఇదివరకులా ఫీచర్లతో అలరించడం ఖాయం.

మరిన్ని వార్తలు