ఈ లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయ్‌ జాగ్రత్త!

25 Jul, 2021 17:52 IST|Sakshi

ఆదాయపు పన్ను శాఖ బ్యాంకు సేవింగ్, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకర్ ప్లాట్ ఫారమ్స్ మొదలైన వంటి వాటిలో ప్రజల నగదు లావాదేవీలను త‌గ్గించడానికి పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ సంస్థల ద్వారా జరిగే నగదు లావాదేవిలపై ఒక నిర్దిష్ట పరిమితి విధించింది. ఈ నిబంధ‌న‌ల ఉల్లంఘన జరిగితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటి అనేది ఈ క్రింద తెలుసుకుందాం.. 

బ్యాంక్ ఎఫ్​డీ(ఫిక్సిడ్ డిపాజిట్): చిన్న పెట్టుబడి పథకాలలో ఫిక్సిడ్ డిపాజిట్ అనేది ఒక మంచి ఆప్షన్. ఒక బ్యాంకు ఎఫ్​డీ ఖాతాలో నగదు డిపాజిట్ చేసే బ్యాంకు డిపాజిటర్ రూ.10 లక్షల మించి ఎఫ్​డీ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

రియల్ ఎస్టేట్: రియల్ ఎస్టేట్ ఒప్పందానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పరిమితిని విధించింది. మీరు ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు రూ.30 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది.

సేవింగ్స్/కరెంట్ అకౌంట్: ఒక వ్యక్తికి సంబంధించిన పొదుపు ఖాతాలో గనుక లక్ష రూపాయలకు పైగా మించి క్యాష్ డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను నోటీసును పంపవచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు ఈ పరిమితి రూ.50 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఆదాయపు పన్ను శాఖ పంపే నోటీసులకు బాధ్యత వహించాలి.

మ్యూచువల్ ఫండ్/స్టాక్ మార్కెట్/బాండ్/డిబెంచర్: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్ లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు పైన పేర్కొన్న పెట్టుబడి ఎంపికల్లో రూ.10 లక్షల పరిమితికి మించి పెట్టుబడి పెట్టకుండా చూసుకుంటే మంచిది. రూ.10 లక్షలకు మించి గనుక పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖ మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)ని చెక్ చేసే అవకాశం ఉంది. 

క్రెడిట్ కార్డు: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే సమయంలో బిల్లు చెల్లింపు అనేది రూ.1 లక్ష పరిమితికి మించి దాటకూడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు చేసేటప్పుడు ఈ నగదు పరిమితి దాటితే ఆదాయపు పన్ను శాఖ మీకు ఐటీ నోటీసులు పంపించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు