వాళ్లందరికీ పన్ను మినహాయింపు: నిర్మలా సీతారామన్

2 Apr, 2021 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఎన్‌ఆర్‌ఐలు సంపాదిస్తున్న వేతనాలపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లు 2021 సవరణల్లోని గల్ఫ్‌ కార్మికుల ప్రత్యేక పన్నును ప్రస్తావిస్తూ.. గల్ఫ్‌లోని భారత కార్మికులపై అదనపు పన్నును విధించనున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ మహుమోయిత్రా చేసిన ట్వీట్‌కు మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. సౌదీ, యూఏఈ, ఒమన్, ఖతార్‌ దేశాల్లో పనిచేస్తున్న భారత కార్మికులపై ఆర్థిక బిల్లు 2021లో కొత్తగా లేదా అదనపు పన్నును ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు. 

ఆదాయ పన్ను చట్టంలో స్పష్టత కోసం పన్నుకు బాధ్యులు అన్న నిర్వచనాన్ని బిల్లులో ఇచ్చినట్టు చెప్పారు. ‘‘గల్ఫ్‌ దేశాల్లో భారత ఎన్‌ఆర్‌ఐ కార్మికులు ఆర్జిస్తున్న వేతనంపై పన్ను అంశంలో ఎంటువంటి మార్పు లేదు. వారి వేతనంపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతుంది’’ అంటూ తన ట్వీట్‌లో మంత్రి సీతారామన్‌ స్పష్టత ఇచ్చారు. తప్పుదోవ పట్టించడమే కాకుండా.. ప్రజల్లో అనవసర భయాలను కలిగిస్తున్నారని పేర్కొన్నారు.

చదవండి:

ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా

>
మరిన్ని వార్తలు